మూసీకి ఇది పునర్జీవనం..

by Ravi |   ( Updated:2024-10-18 01:15:47.0  )
మూసీకి ఇది పునర్జీవనం..
X

మూసీ నది ప్రక్షాళన అభివృద్ధిని వ్యతిరేకించే వాళ్లు ఒక్కసారి...మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ల జీవితాలను గూర్చి మనసుతో ఆలోచించండి. వాళ్లను అలానే మురికి కూపంలోనే వదిలేసి, మనం మాత్రం ఏసీ బంగ్లాలో నివసిస్తూ, రాజకీయ పబ్బం గడపడటం ఎంతవరకు సమంజసమో..? దీనిపై విమర్శించే వారు మానవతా కోణంలో ఆలోచించాలి. అధికార పార్టీపై పగ, ప్రతీకారం కోసం అమాయక ప్రజల భవిష్యత్తును ఫణంగా పెట్టడం ఎంతవరకూ సమంజసమో.. బీఆర్ఎస్ పార్టీ నేతలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మూసీనది కాలుష్యం ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.

మూసీ అంటే.. ఒక్కప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు జీవనాడి. కానీ ఇప్పుడు మూసీ అంటే ఓ కాలకూట విషం అన్న అభిప్రాయం నేడు ప్రబలంగా ఉంది. ఈ నదిలో కేన్సర్ కారకాలైన ఆర్సెనిక్, క్రోమియం, కాపర్, నికిల్, లెడ్‌ తదితర భార లోహాలున్నట్లు ఎన్‌జీఆర్‌ఐ తన పరిశీలనలో గుర్తించింది. ఈ కలుషితమైన నీరు ప్రజల ఆరోగ్యానికి భారీగా హాని చేస్తోందనీ ముఖ్యంగా వివిధ రకాలైన కేన్సర్‌లు, మూత్రపిండాల వ్యాధులు, చర్మ వ్యాధులు, అబార్షన్లు, కీళ్ల నొప్పులు, కడుపు నొప్పి, గొంతు నొప్పి తదితర రోగాల బారిన పడతారని, వ్యవసాయ భూములు పంటలకు పనికి రాకుండా పోతాయనీ. చెరువుల్లో చేపలు, గడ్డిమేసే పశువులు, నీళ్లు తాగే పక్షులు సైతం పునరుత్పత్తి శక్తిని కోల్పోయే ప్రమాదముందని పరిశోధనలు తేల్చాయి.

నీటి నాణ్యత ఇండెక్స్‌లో..

నల్గొండ ఫ్లోరైడ్ కష్టం చెప్పుకుంటే తీరేది కాదు.. ఇక్కడ భూగర్భ జలాలనే కాకుండా, ఉపరితల జలాలను కూడా శుద్ధి చేసి వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర జలశక్తి సంస్థ చెప్పింది. కానీ గతంలో పాలించిన ప్రభుత్వాలు దాన్ని అమలు చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైనట్లే, నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నల్గొండ సమస్య పరిష్కారానికి ఏ మాత్రం చొరవ చూపలేదు. మూసీ నది కాలుష్యం ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఈ మధ్యనే వచ్చిన నదులనీటి నాణ్యతా ఇండెక్స్‌లో మూసీ రివర్ నీటిలో ఆక్సీజన్ స్థాయిలను ప్రభావితం చేసే టర్బిడిటీ స్థాయిలు 1- 4 మధ్యన ఉండాల్సిన స్థానే, దామరచర్ల దగ్గర 15 గా, వలిగొండ దగ్గర 13 గా, వాడపల్లి దగ్గర 13‌గా ఉంది. బీఓడీ (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) స్థాయిలు 3 మిల్లీ గ్రాముల కంటే తక్కువ ఉండాలి. కానీ వలిగొండ దగ్గర 10.01 శాతం ఉంది. డయేరియా, జ్వరం, చర్మ వ్యాధులకు కారణమయ్యే భయంకరమైన కోలిఫాం బ్యాక్టీరియా తాగునీటిలో అసలే ఉండకూడదు. కానీ, దామరచర్లలో 1400గాను, వలిగొండ ప్రాంతంలో 2200 గాను, వాడపల్లి దగ్గర 1500గాను ఉంది. మూసీ నీటితో సాగు చేసే పంటలు, కూరగాయలను మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌ వాసులు దశాబ్దాలుగా వాడుతున్నారు.

కాలుష్యానికి అసలు కారణం..

ఈ నదిలో కాలుష్యానికి కారణం నిత్యం వందలాది పరిశ్రమలు, ఔషధ కంపెనీలు తమ వ్యర్థాలను నదిలోకి వదులుతుండటం. కాటేదాన్, పటాన్‌చెరు, జీడిమెట్ల, కూకట్‌పల్లి, సనత్‌నగర్, ఆజామాబాద్, ఉప్పల్, మల్లాపూర్, నాచారం ఇండ్రస్ట్రియల్‌ ఏరియాల నుండి విషరసాయనాలు నేరుగా మూసీలో వదిలేయడం అతి ప్రధాన సమస్యగా మారింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఇళ్ల నుండి వచ్చే డ్రైనేజీ నీళ్లు, వ్యర్థ పదార్థాలన్నీ ఇప్పుడు మూసీలోనే కలుస్తున్నాయి. ఈ విషపు నీళ్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా కృష్ణాలో కలుస్తూ విషాన్ని పంచుతుంది. హైదరాబాద్‌లో నిత్యం 2000 ఎంఎల్‌‌డీల వరకు మురుగు, రసాయనాలతో కూడిన వ్యర్థజలాలు మూసీలో కలుస్తున్నాయి. ఇందులో కేవలం 800 ఎంఎల్‌‌డీల నీటినే ఎస్‌‌టీపీల ద్వారా శుద్ధి చేస్తున్నారు. మిగతాది శుద్ధి లేకుండానే మూసీకి వదులుతున్నారు. ఫలితంగా మూసీ డంపింగ్ యార్డుగా మారిపోతోంది. రెండేళ్ల కిందట మూసీలోకి 350 మిలియన్ లీటర్ల కాలుష్యం మాత్రమే వెళ్లగా ఇప్పుడది 1,625 మిలియన్ లీటర్లకు పెరిగింది.

అప్పుడే ప్రక్షాళన ప్రారంభించాలి!

మూసీ అభివృద్ధి ప్రాజెక్టు పనులు ప్రారంభమవ్వాలంటే ముందుగా మూసీ వెంట వివిధ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లోని అక్రమణలన్నీ తొలగించాలనీ మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌ఎఫ్‌డీసీఎల్‌) నిర్ణయించింది. ఇందుకు వివిధ శాఖల అధికారులతో పశ్చిమాన ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి తూర్పున కొర్రెముల వద్ద ఉన్న ఔటర్‌ వరకు సర్వేను పూర్తిచేశారు. నార్సింగ్‌ నుంచి నాగోల్‌ బ్రిడ్జి వరకు దాదాపు 25 కిలోమీటర్ల మేర ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో 12 వేలకు పైగా అక్రమణలు ఉన్నట్లు గుర్తించింది. చాలావరకు 30, 40, 60 గజాల్లోనే పేద ప్రజలు ఇళ్లు కట్టుకున్నారు. మధ్యలో 10 అడుగుల దారి కూడా లేకుండానే నిర్మించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా కాలనీలే వచ్చేశాయి. కొందరు గోదాములు, షెడ్‌లు ఏర్పాటు చేసి పెద్దఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. సర్వం కోల్పోయిన కుటుంబాలకు ఉచిత వసతి గృహాలు, ఉచిత రవాణా సౌకర్యం కల్పించి వాళ్లను సంతృప్తి పరిచిన తర్వాతనే మూసీ నది ప్రక్షాళన అభివృద్ధి చేపట్టాలి. లేకపోతే అమాయకులకు అన్యాయం చేసిన వారిగా చరిత్రలో నిలిచిపోయే అపవాదు ఉంటుందని ప్రభుత్వంలోని పెద్దలు గ్రహించాలి.

బీఆర్ఎస్ పార్టీ ఎందుకిలా?

ఇప్పటికైనా మూసీ నదిని ప్రక్షాళన, అభివృద్ధి చేయకుండా ఇలానే వదిలేస్తే.. రాబోయే రోజుల్లో మరింత తీవ్రమై ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్ జిల్లా ప్రజల మనుగడ ప్ర‌శ్నార్థకం అయ్యే అవకాశం ఉంది. మూసీ అభివృద్ధి ఫోరం పేరుతో గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి హరీష్ రావు జపాన్ వద్ద రూ.1000 కోట్లు తీసుకువచ్చి ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా నేడు రాజకీయ పబ్బం కోసం మూసీ పరివాహక ప్రాంత గృహ నిర్మాణదారులకు అండగా ఉంటామని మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆనాడు సాక్షాత్తు నాటి సీఎం కేసీఆర్ మూసీ నది ప్రక్షాళనకు అందరూ సహకరించాలని మీడియాతో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబట్టి మూసీ నది ప్రక్షాళన ప్రయత్నాలకు, ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తూ అడ్డు పడవద్దని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవకాశవాద రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అధినేతలను తెలంగాణ సమాజం ప్రార్థించుతున్నది.

డాక్టర్. బి. కేశవులు ఎండి.

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం

85010 61659

Advertisement

Next Story

Most Viewed