నూతన క్రిమినల్ చట్టాల సారం!

by Ravi |
నూతన క్రిమినల్ చట్టాల సారం!
X

మన దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ ప్రభుత్వం వరుసగా 1833, 1853, 1861, 1879 సంవత్సరాల్లో లా కమిషన్స్‌ని ఏర్పర్చి వివిధ చట్టాల రూపకల్పనకు నాంది పలికింది. ప్రస్తుత క్రిమినల్ చట్టాలైన భారతీయ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లను వీటితోపాటు ఇండియన్ ఎవిడన్స్ యాక్ట్‌ను రూపొందించారు. ఇవే చట్టాలను నూతనంగా రూపొందించడానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 2020 మార్చిలో ఒక ప్యానెల్‌ని ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ ప్రతిపాదనలు చేయగా వీటిని 2022 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు అవకాశం కల్పించింది. చరిత్రలో మొదటిసారిగా చట్టాల రూపకల్పనలో ఒక ప్రత్యేక విధానం ద్వారా ప్రజల సూచనలను తీసుకోవడం జరిగింది.

గత క్రిమినల్ చట్టాల్లో లోపాలు

భారతీయులను అణచిపెట్టడం, భారతదేశ వనరులను దోపిడీ చేసి తమ దేశానికి తరలించడమే ప్రధాన లక్ష్యంగా బ్రిటీష్ ప్రభుత్వం క్రిమినల్ చట్టాలను రూపొందించిది. బ్రిటీష్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ క్రిమినల్ చట్టాలు ఇప్పటికీ అంటే దాదాపు 175 సంవత్సరాలుగా ఇంకా అమలులో ఉండడం ఘోరమని భావించవచ్చు. ఈ చట్టాల్లో చాలా సందర్భాల్లో లింగ తటస్థత లోపించడం కూడా గమనించవచ్చు. ఈ చట్టాల అమలులో క్లిష్టత వల్ల న్యాయస్థానాల్లో తీర్పు ఆలస్యం అవుతోంది. బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రిమినల్ చట్టాలు వివిధ రకాలుగా ప్రస్తుత కాలానికి సరితూగడం లేదని చెప్పాలి. వాటి మార్పు ప్రస్తుతం మన దేశ విధి విధానాలను, భవిష్యత్‌ను అనుసరించే విధంగా ఉంటే మంచిది.

నూతన చట్టాల్లో మార్పులు

కొత్త చట్టాల్లో సరికొత్త నేరాలుగా స్నాచింగ్ (అపహరణ) మోబ్ లించింగ్ (ముకోన్మాదం), పెళ్లాడటంపై నకిలీ వాగ్దానం వంటివి చోటు చేసుకున్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీ, ఏటీఎం దొంగతనం, పొంజి స్కీం వంటి వాటిని నేరాలుగా చేర్చారు. నూతన భారతీయ నాగరిక శిక్షా సంహితలో సెక్షన్ 105 ప్రకారం సెర్చ్, సీజర్ ప్రొసీజర్‌ని ఆడియో, వీడియో ద్వారా అనుమతించే అధికారాన్ని ఇవ్వడం జరిగింది. దీనిలోని సెక్షన్ 61 ప్రకారం ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డింగ్‌ని సాక్ష్యంగా అనుమతించడం ప్రధాన అంశంగా భావించవచ్చు. ఇక సెక్షన్ 124 రాజద్రోహం, 309 ఆత్మహత్యా ప్రయత్నం రెండింటిని నేర జాబితా నుండి తొలగించడం సరైన నిర్ణయంగా భావించవచ్చు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే సాయుధ తిరుగుబాటు, అణచివేత వంటివాటిపై కఠినమైన విధి విధానాలను నూతన చట్టాల్లో రూపొందించడం జరిగింది

చట్టాల ముఖ్య ఉద్దేశం

ఈ కొత్త చట్టాల ప్రధాన ఉద్దేశం సరైన న్యాయాన్ని సత్వరంగా అందించడమే. ఒక కేసు నమోదు అయినప్పటి నుండి 3 సంవత్సరాలలోనే ఆ కేసును పూర్తిగా విచారించి న్యాయస్థానం నుండి తీర్పు ఇవ్వాలనే విధానాన్ని చట్టంలో చేర్చడం వల్ల ఇకపై న్యాయస్థానాల్లో జాప్యం తగ్గి ప్రజల అనేక సమస్యలు అతి తక్కువ కాలంలోనే పరిష్కరించబడతాయి. న్యాయస్థానాల్లో న్యాయం అతి తక్కువ కాలంలో దొరుకుతుందని ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. సత్వర న్యాయం, న్యాయమైన విచారణ, న్యాయమైన పరిహారం ప్రజలకు అందించేలా ఈ చట్టాలు రూపొందించడం కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు.

- గోవింద్ గద్వాల్

93920 94078

Advertisement

Next Story