రాజకీయాల్లో కొత్త ఆశాకిరణం.. పవన్ కల్యాన్

by Ravi |   ( Updated:2024-09-01 00:45:20.0  )
రాజకీయాల్లో కొత్త ఆశాకిరణం..  పవన్ కల్యాన్
X

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌.. ఆ పేరు వింటే ఒక వైబ్రేష‌న్‌. అది సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా.. సినిమాల్లోకి రాకముందు చిరంజీవి తమ్ముడిగానే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కొణిదల కల్యాణ్‌ ఆ తర్వాత తన పవర్‌ ఏమిటో చూపి పవన్‌ కల్యాణ్‌గా మారారు.

తన రాజకీయ భవిష్యత్తు కంటే..

ఆయన తన సినిమాలోని ఓ డైలాగ్ మాదిరి.. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు. అందుకే సమయం వచ్చినప్పుడు ఆవేశాన్ని ప్రదర్శించినా కొన్నిసార్లు సంయ మనం కూడా పాటించారు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, తన పార్టీనే అధికారంలోకి రావాలని లేదా వీలైనన్ని ఎక్కువ సీట్లు తీసుకుని కింగ్‌ మేకర్‌ పాత్ర పోషించాలని అనుకుంటారు. కానీ తన రాజకీయ భవిష్యత్తు కంటే ఏపీ ప్రజల భవితే ముఖ్యమనుకుని త్యాగానికి తానే ముందుకొచ్చి 21 సీట్లలోనే పోటీకి సిద్ధపడ్డారు. దీనిపై సొంతపార్టీ నేతల నుంచి అభిమానుల నుండి అసంతృప్తి వ్యక్తమైనా పట్టించుకోలేదు. ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లలోనూ తన పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు ఓడిపోలేదు. పవన్‌ స్టామినా అంటే ఏమిటి అన్నది ఎన్నికల ఫలితాల తర్వాతే తెలిసింది. పవన్‌ కల్యాణ్‌ అనే వ్యక్తి పూనుకోకపోతే ఏపీలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించేది కాదు అంటే అతిశయోక్తి కాదు.

ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా..

2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు చోట్లా ఓడిపోయారు. రాజకీయాలకు స్వస్తి పలికి సినిమాలు చేస్తే కూర్చున్న చోటే కోట్ల రూపాయల సంపాదన వచ్చే అవకాశం ఉన్నది. కానీ తన ఆర్థిక అవసరాల కోసం కొన్ని సినిమాలు అంగీకరించారు. సినిమాలు తన వృత్తి అంటూనే.. తన లక్ష్య సాధనపైనే దృష్టి సారించారు. ఓటమి నేర్పిన పాఠాల నుంచే గెలుపునకు బాటలు వేశారు.. కొద్ది రోజుల్లోనే దాని నుంచి తేరుకుని మళ్లీ పోరాటం ప్రారంభించారు. కామన్‌ మ్యాన్‌ ఆలోచనలకు తగ్గట్లుగా నడుచుకోవడంలో జనసేనాని సక్సెస్‌ అయ్యారు. ఆయన గెలుపు.. ఏపీకి ప్రగతికి మలుపు. ప్రధాని అన్నట్లు పవన్‌ అంటే సునామీ. కూటమి ఏర్పాటులో కర్త, కర్మ, క్రియా అంతా తానై నడిపించాడని ఆయనను ప్రశంసించారు.

ఎన్నికల వరకే రాజకీయాలంటూ..

ప్రభుత్వాన్ని మార్చాలని 2021లోనే ఆయన ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో.. ఇప్పటం సభలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని కీలక ప్రకటన చేశారు. దానికి కొనసాగింపుగానే చంద్రబాబు అరెస్టు సమయంలో రాజమహేంద్రవరం జైలులో ఆయనను పరామర్శించి అక్కడే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లో టైమింగ్‌ అన్నది ఎంత ముఖ్యమో పవన్‌ ఆ ప్రకటన ద్వారా చూపెట్టారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రజాగ్రహాన్ని చూసిన పవన్‌ ప్రజలు ఏం కోరుకుంటున్నారో పక్కా గా అంచనా వేశారు. జన నాడి పట్టుకున్న జనసేనాని నిర్ణయం ఫలితాల నాడు అందరికీ కనిపించింది.

గెలిచిన తర్వాత చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో పవన్‌కు డిప్యూటీ సీఎంగా సముచిత స్థానం కల్పిం చారు. 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి'తో అరం గేట్రం చేసిన తనను డిప్యూటీ సీఎం స్థాయికి తీసుకొచ్చిన జనాలను తిరిగి ఏదైనా చేయాలన్న సంకల్పం జనసేనానిలో నిత్యం ఉంటుంది. అందుకే తనకు ఇష్టమైన గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకుని తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని తర్వాత ప్రజాసేవకే తన ప్రథమ ప్రాధాన్యం అన్నట్లు నిత్యం ప్రజలను కలుస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. వారి విజ్ఞప్తులను స్వీకరిస్తున్నారు. పరిష్కారం కోసం పనిచేస్తున్నారు. 'ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాధికారం అనేది మాస్టర్ కీ' అన్న డాక్టర్‌ బి.ఆర్. అంబేడ్కర్ ఆలోచనలను తన రాజకీయ జీవితంలో అనుసరించి విజయవంతమయ్యి ముందుకు సాగుతున్న పవన్ కల్యా‌ణ్ ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు..

(రేపు పవన్ కల్యా‌ణ్ జన్మదినం)

కుమారస్వామి (అక్షర)

'షరతులు వర్తిస్తాయి' సినిమా దర్శకుడు

96767 26726

Advertisement

Next Story

Most Viewed