మధ్యప్రాచ్యంలో మంటలు..

by Disha edit |
మధ్యప్రాచ్యంలో మంటలు..
X

ఉక్రెయిన్, రష్యా యుద్ధం కొనసాగుతుండగానే, పాలస్తీనాపై హమాస్ ఉగ్రవాదుల దాడి, అందుకు ప్రతీకారంగా ఇజ్రాయిల్ సైన్యం పాలస్తీనా సామాన్య ప్రజలపై విరుచుకుపడడంతో మధ్య ఆసియా ప్రాంతం శాంతిభద్రతల సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ఇజ్రాయిల్‌పై ఇరాన్ క్షిపణులతో దాడి, ఇజ్రాయెల్ ప్రతి దాడి చేయడంతో మధ్య ప్రాచ్యంలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.

సిరియా రాజధాని డెమోస్కస్లో ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్ దాడి చేసి, ఇరాన్‌కు చెందిన మిలిటరీ అధికారులను హతమార్చడంతో, 230 క్షిపణిలను ఇజ్రాయిల్‌పై ప్రయోగించి ప్రతీకారాన్ని తీర్చుకున్నది. అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దిన ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థలకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల అందించిన రక్షణ వ్యవస్థలు తోడ్పడడంతో ఇరాన్ ఉపయోగించిన క్షిపణులను మధ్యలోనే ఇజ్రాయిల్ పేల్చేసింది. తమ దేశంపై ఇరాన్ దాడి చేసినందుకు ప్రతీకారం తప్పదని ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించడం ప్రపంచాన్ని ఆందోళన కలిగించే విషయమే. అయితే, అమెరికా సహాయ సహకారాలు లేకుండా ఇజ్రాయిల్ ఇరాన్‌పై దాడి చేయదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఇరాన్‌పై ఇజ్రాయిల్ చేసే దాడిలో అమెరికా పాల్గొంటే తాను ఇరాన్ వైపు ఉంటానని రష్యా ప్రకటించడం మరింత ఆందోళన కలిగించే విషయం.

ముస్లిం దేశాల దారెటు..?

ఇజ్రాయిల్ అమెరికా కలిసి ప్రతి దాడి చేస్తాయనే ఉద్దేశంతోనే ఇరాన్ ముందుగానే అమెరికాతో ఈ విషయం ప్రస్తావించి, అమెరికా తటస్థంగా ఉండేటట్లు దౌత్య నీతిని ప్రదర్శించింది. ఈ విషయంలో రష్యాతో ఇరాన్ చర్చలు జరిపి, తమకు సహాయంగా ఉండాలని ముందుస్తు హామీని పొందింది. ఒకవేళ మధ్యప్రాచ్యంలో తన ఆర్థిక, రాజకీయ, రక్షణ ప్రయోజనాలకు భంగం వాటిల్లే పరిస్థితులు ఉద్భవిస్తే, అమెరికా మాటతప్పి, ఇజ్రాయిల్‌కు సహాయ సహకారాలు అందిస్తుంది. కానీ ఉక్రెయిన్‌తో తీవ్రంగా పోరు సలుపుతున్న రష్యా ఇరాన్‌కు సహాయంగా యుద్ధంలో దిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న సంఘర్షణలో గల్ఫ్ దేశాలు, ఇతర ముస్లిం దేశాలు ఇరాన్‌కు సహాయంగా నిలబడే ప్రసక్తే లేదు. హైతీ, హిజ్బుల్ మొజాహిద్దీన్ తీవ్రవాద గ్రూపులను ప్రోత్సహించి, ఐరోపా ఖండం నుండి వచ్చే షిప్పులను అటకాయించి, అంతర్జాతీయ వ్యాపారాన్ని అడ్డుకొని, ఇస్లామిక్ దేశాల్లో తన పలుకుబడిని పెంచుకోవాలని ఇరాన్ తలపోస్తున్నదని, ఇరానేతర ముస్లిం దేశాలు భావించడం ఇజ్రాయిల్‌కు ఒకింత లాభం చేకూర్చే విషయమే. పైగా ఇస్లాం ప్రపంచంలో షియా- సున్ని తెగల మధ్య పోరు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఇరాన్ షియా ముస్లిం ఆరాధన పద్ధతిలో ఉండే దేశం. టర్కీ, జోర్డాన్, ఈజిప్ట్ సౌదీ వంటి దేశాలు సున్ని ఆరాధనా పద్ధతులను అనుసరిస్తాయనేది గమనార్హం. ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలన్నిటిని ఒక గ్రూప్ కింద తేవడానికి ఇస్లాం దేశాల సమాఖ్య ఉన్నప్పటికీ దాని ప్రభావం నామ మాత్రమే. పైగా ఇస్లామిక్ దేశాల్లో మతం ఒకటే అయినప్పటికీ, జాతులు అనేకం. ఈ వైవిధ్యంతోనే ఇరాన్, ఇరాక్ పది సంవత్సరాలు ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుని, తీవ్రంగా నష్టపోయాయి.

భారత్ వైఖరేంటి?

మధ్య ఆసియాలో నిరంతరం ఘర్షణలు జరగాలని అమెరికా తదితర పాశ్చాత్య దేశాలు కోరుకుంటాయి. వారి ఆయుధాలకు గిరాకీ ఉండాలంటే అక్కడ ఘర్షణలు నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. ఇదే సందర్భంలో ప్రపంచంలో బలీయమైన శక్తిగా ఎదగాలని కోరుకుంటున్న భారత్ ఆ ఘర్షణలను నివారించి, అక్కడ శాంతియుత పరిస్థితులను పునరుద్ధరించవలసిన గురుతర బాధ్యత ఉంది. ఇజ్రాయిల్ ఇరాన్ సంఘర్షణలలో మన దేశం తటస్థంగా ఉండడం చాలా అవసరం. చైనా సిల్క్ రోడ్డుకు ప్రతిగా గల్ఫ్ దేశాలను, ఐరోపా తో కలిపి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కార్డియార్ ను భారత్ ఏర్పాటు చేయడానికి ఇరాన్ సహకారం చాలా అవసరం. పైగా ఇరాన్‌తో మనకు చారిత్రికంగా, సాంస్కృతికంగా, భాషాపరంగా ఎంతో మైత్రీ భావన ఉంది. పర్షియాగా పిలువబడిన ఇరాన్‌లో పర్షియన్ సంస్కృతికి, ఇస్లాం సంస్కృతికి ఘర్షణ ఏర్పడిన సందర్భంలో భారతదేశం పారశీకులను ఆదరించింది. చాలామంది ఇరానీలు ఇస్లాం మతాన్ని స్వీకరించినప్పటికీ భారతదేశం పట్ల వారికి గురుత్వ భావన ఉండనే ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న మోడీ ప్రభుత్వం ఇరాన్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తుంది.

ఉల్లి బాల రంగయ్య ,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు.

94417 37877



Next Story

Most Viewed