ఈ రిజర్వేషన్ బడుగులకు శాపం!

by Ravi |   ( Updated:2024-09-10 01:00:49.0  )
ఈ రిజర్వేషన్  బడుగులకు శాపం!
X

ఈడబ్ల్యూఎస్" అంటే, ఉన్నత కులాల్లో ఆర్థిక వెనుకబాటు ఆధారంగా విద్య, ఉద్యోగాలలో ఇచ్చే రిజర్వేషన్. వీరికి మొత్తం ఉద్యోగాలలో 10శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు. సమాజంలో 5శాతం ఉన్న వారికి 10శాతం రిజర్వేషన్లు ఇవ్వ డం దుర్మార్గం. దీనివల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అవకాశాలు కోల్పోతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు ఉండగా, సమాజంలో 52 శాతం పైగా ఉన్న బీసీలకు 26శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి. ఉదాహరణకు "ఈడబ్ల్యూఎస్" రిజర్వేషన్ పొందిన మహిళా అభ్యర్థి, ఎస్సీ మహిళా అభ్యర్థి కన్నా తక్కువ మార్కులు తెచ్చుకున్నా ఉద్యోగం పొందుతుంది. ఇటీవల తెలంగాణా పోలీస్ ఉద్యోగ నియామక పరీక్షలలో, గురుకుల ఉద్యోగ పరీక్షలలో ఇది నిరూపితమైంది.

ఈడబ్ల్యూఎస్ వారికి రిజర్వేషన్లు ఇవ్వటం వల్ల మెరిట్ తెచ్చుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలలో అవకాశాలు కోల్పోతున్నారు. వీరు మెరిట్‌తో ఓపెన్ కేటగిరీ‌లో ఉద్యోగం పొందినప్పుడే, ఇదే కేటగిరీలోని కింది అభ్యర్థులకు వారి కేటగిరీలో ఉద్యోగం దక్కు తుంది. కానీ ఈడబ్ల్యూఎస్ విధానం వల్ల ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ కావాల్సిన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ అభ్యర్థులు కిందికి దిగి వారి రిజర్వేషన్ కేటగిరీలోకి వెళ్లవలసి వస్తుంది. ఫలితంగా కొంచం తక్కువ మార్కులు వచ్చి బోర్డర్‌లో సెలెక్ట్ కావలసిన రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులు ఉద్యోగం పొందలేకపోతున్నారు.

బీసీల పిల్లలకు తీవ్ర అన్యాయం

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయకపోతే భవిష్యత్‌లో అత్యున్నత ఉద్యోగాలల్లో వెనుకబడిన కులాల వారు ఉండరు. ఆ ఉద్యోగాలలో సింహభాగం అగ్రకులాలవారే దక్కించుకుంటారు. పాలకులంతా అగ్రకులాల వారే కావడంతో, ఈ రిజర్వేషన్‌లపై ఏమీ మాట్లాడటం లేదు. న్యాయస్థానాలలో కూడా అడ్డు లేకుండా ఉత్తర్వులు పొందారు. బడుగు, బలహీన కులాలకు చెందిన నాయకులు, మేధావు లు ఈ రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బీసీ నాయకులు ఉద్యమించాలి. ఎస్సీ, ఎస్టీలకు, వారి జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు ఉన్నాయి, అగ్రకులాల వారికి ఈడబ్ల్యూఎస్ రూపంలో వారి జనాభాకు మించి రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ బీసీలకు మాత్రం వారి జనాభాలో సగం రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయి. దీనివల్ల భవిష్యత్తులో విద్యా, ఉద్యోగాలలో బీసీ పిల్లలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.

బీసీ కులగణన తప్పనిసరి!

జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలి. బీసీ కులగణన జరగాలి, అప్పుడే అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేస్తాయి. చట్టసభలలో అగ్ర కులాలు ఉన్నంత కాలం బీసీలకు ఏ రంగంలో కూడా న్యాయం జరగదు. కాబట్టి అగ్ర కులాల వారిని చట్ట సభలకు పంపే ఓటును అగ్రకులాలకు వేయకుండా నిరాకరించాలి. అప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది.

- నారగొని ప్రవీణ్ కుమార్

98490 40195

Advertisement

Next Story