దేవుని సొమ్ము... ప్రజలకోసం ఖర్చు చేయవద్దా?

by Ravi |
దేవుని సొమ్ము... ప్రజలకోసం ఖర్చు చేయవద్దా?
X

దేవుని సొమ్మును ప్రజల అవసరాలను తీర్చడానికి ఖర్చు చేయవచ్చా లేదా అన్న చర్చ తిరుపతి నగరంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతుంది. దేవుని సొమ్ము ప్రజల అవసరాలకు ఖర్చు చేయకూడదని గత అనేక ఏళ్లుగా బీజేపీ అడ్డంకులు సృష్టిస్తున్నది. తిరుమల-తిరుపతి దేవస్థానం పాలక మండలి తిరుపతి అభివృద్ధికి తన బడ్జెట్‌లో ఒక శాతం నిధులు కేటాయించటం, తిరుపతి నగరంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు టీటీడీ బాధ్యత తీసుకోవటాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ కోర్టులో వ్యాజ్యాలు నడుపుతున్నది.

ఇదే అంశంపై తెలంగాణాకు చెందిన ఓ కేసులో మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్, మరో న్యాయమూర్తి ఎస్. రవీంద్ర భట్ లు ఆసక్తికరమైన వ్యాఖ్యలు గతంలో చేశారు. 1863 దేవాదాయ చట్టాన్ని ఉదహరిస్తూ ఆలయాలకు వచ్చే నిధులు ప్రజల నుంచే కాబట్టి అవి తిరిగి ప్రజలకే వెచ్చించాలని అన్నారు. సమాజం పెద్ద అవసరాలను ప్రభుత్వమే కాకుండా ఆదాయం ఉన్న ఆలయాలు, మత సంస్థలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా తిరుమల - తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఢిల్లీలోని విద్యా సంస్థ గురించి, కళాశాలలు, వైద్య సంస్థల గురించి న్యాయమూర్తులు ప్రస్తావించారు. దేశంలో 9 లక్షల ఆలయాలు ఉండగా ప్రభుత్వ నియంత్రణలో 4 లక్షలు ఉన్నాయని సామాజిక అవసరాలు తీర్చటం ఆలయాల బాధ్యతగా ఉండాలని చెప్పారు.

శుభ్రతకు బీజేపీ అడ్డు

ఇంటికొచ్చే ఎవరినైనా కాళ్లు చేతులు కడుక్కుని లోపలికి రమ్మనడం ఆనవాయితీ. అలాంటిది తిరుపతి మీదుగా తిరుమలకు వెళ్లాల్సిన భక్తులకు అత్యంత శుభ్రంగా, పవిత్రంగా తిరుపతిని ఉంచటానికి టీటీడీ తన నిధులను పారిశుధ్య నిర్వహణకు కేటాయింపులు చేస్తే బీజేపీ అడ్డుపుల్ల వేసింది. తిరుపతి నగరాభివృద్ధికి ఒక శాతం నిధులను మున్సిపాలిటీకి కేటాయిస్తూ టీటీడీ పాలకమండలి చేసిన తీర్మానంపై బీజేపీ వ్యతిరేకిస్తూ అడ్డగోలు వాదనలు చేసింది. విశ్వహిందూ పరిషత్ ఏపీలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేసి టీటీడీ చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించింది.

తిరుపతి నగరానికి రోజుకు కనీసంగా లక్ష మంది భక్తులు వస్తుంటారు. గత ఏడాది పెరటాసి మాసం సందర్భంగా 5 లక్షల మంది తిరుమలకు వచ్చారు. వీరంతా తిరుపతి మీదుగా తిరుమలకు చేరుకోవలసిందే. ఇంత మంది భక్తుల విసర్జకాలు, వ్యర్థాలను నిర్వహించటానికి తమ శక్తి సరిపోవడం లేదని... టీటీడీ కూడా బాధ్యత తీసుకోవాలని స్థానిక మున్సిపాలిటీ టీటీడీని కోరింది. దీనికి సానుకూలంగా టీటీడీ స్పందించి భక్తులు తిరుగాడే ప్రాంతాల పారిశుధ్య పనుల బాధ్యతను తానే తీసుకుని, టెండర్లను పిలిచింది. దీనిని వ్యతిరేకిస్తూ బీజేపీ... భక్తుల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని కోర్టుకెక్కింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో పనులు ఆగాయి.

'దళితుల ఉపాధికి గండి'

తిరుపతిలో పారిశుధ్య పనులను అడ్డుకోవడం ద్వారా బీజేపీ దళితులు, గిరిజనులు, మహిళల ఉపాధికి గండి కొట్టింది. టీటీడీ పారిశుధ్య పనులు చేపట్టడం ద్వారా మరో 1600 కుటుంబాలకు ఉపాధి ఏర్పడేది. 1600 మంది కార్మికులకు పని కల్పించటానికి అవసరమైన ఏర్పాట్లు జరిగిన నేపథ్యంలో ఈ వర్గాలకు బీజేపీ ద్రోహం తలపెట్టింది. ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మిరాశీ వ్యవస్థను రద్దు చేస్తూ 1987లో చేసిన ఈ చట్టాన్ని బీజేపీ నాడు తీవ్రంగా వ్యతిరేకించింది. టీటీడీ ఆదాయంలో కొంత భాగాన్ని మిరాశీలకు చెల్లించాల్సిందేనని, సాంప్రదాయకంగా వస్తున్న మిరాశీ వ్యవస్థను రద్దు చేయడానికి ఎన్టీఆర్ ప్రభుత్వానికి హక్కులేదని బీజేపీ వాదించింది. మిరాశీలకు అండగా బీజేపీ నిలబడింది. 1988వ సంవత్సరంలో తిరుపతి భూగర్భ డ్రైనేజీ పనులకు 25 కోట్లు అవసరమని, టీటీడీ సమకూర్చాలని తిరుపతి మున్సిపాలిటీ అభ్యర్ధించింది. టీటీడీ సానుకూలంగా స్పందించి రూ.25 కోట్లు కేటాయిస్తూ తీర్మానించింది. బీజేపీ, వీహెచ్‌పీలు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకెక్కాయి. రూ.25 కోట్లు కాస్తా రూ.100 కోట్లు ఖర్చు అయ్యేంత వరకు కోర్టులలో వ్యాజ్యాలు నడిపి చివరకు వీహెచ్‌పీ ఓడిపోయింది. టీటీడీ గెలిచింది. నాడు నిర్మించిన భూగర్భ డ్రైనేజీ నిర్మాణం నేటికీ తిరుపతికి తోడ్పడుతున్నది.

బీజేపీ రెండు నాల్కల ధోరణి'

తిరుపతి నగరానికి సమీపంలో కరకంబాడి వద్ద టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని టీటీడీ తీర్మానించగా నాటి ఈఓ ఐవైఆర్ కృష్ణారావు ద్వారా బీజేపీ, వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్‌లు కోర్టుకెక్కి అడ్డుకున్నాయి. ఏళ్ల తరబడి వ్యాజ్యాలు నడిచిన తర్వాత ఇప్పుడు తిరుపతికి 30 కి.మీ దూరంలోని వడమాలపేటలో స్థలాలు కేటాయించారు. బీజేపీ పుణ్యమా అని ఉద్యోగులు ఉసూరుమంటున్నారు. తిరుపతిలో ట్రాఫిక్ కష్టాలు తీరటానికి టీటీడీ హయాంలో మున్సిపాలిటీ, టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మాణం తలపెట్టిన గరుడవారధి (ప్రస్తుతం శ్రీనివాససేతు)ని బీజేపీ అడ్డుకుని హైకోర్టు మెట్టెక్కింది. ప్రజాగ్రహంతో వెనక్కు తగ్గి తన 'పిల్' ను ఉపసంహరించుకుంది. తిరుపతి రోడ్ల అభివృద్ధికి, ఉద్యోగుల, కాంట్రాక్టు కార్మికుల సౌకర్యాలు, వేతనాల పెంపుకు, విద్యా, వైద్యానికి టీటీడీ ఖర్చు చేయటాన్ని బీజేపీ అడుగడుగునా వ్యతిరేకిస్తున్నది.

తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు ఖర్చు చేయాలని చేసిన తీర్మానానికి టీటీడీ బోర్డులో ఉన్న బీజేపీ సభ్యులు అనుకూలం. బోర్డు బయట ఉన్న బీజేపీ వ్యతిరేకం. తిరుమల కొండపై బీజేపీ వైఖరి ఒక రకంగా, కొండ కింద బీజేపీ వైఖరి మరో రకంగా ఉండటాన్ని పలువురు విమర్శిస్తున్నారు.

29 మందితో ఉన్న ప్రస్తుత టీటీడీ బోర్డులో బీజేపీ అనుకూలురు 9 మంది ఉన్నారు. కర్ణాటక బీజేపీ ఎంఎల్ ఏ సైతం సభ్యుడిగా ఉన్నారు. బీజేపీ నేతలు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌ల సిఫార్సుతో కలిపి మొత్తం 9 మంది సభ్యులుగా ఉన్నారు. తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు ఒక శాతం ఖర్చు చేయడానికి, పారిశుధ్య పనుల నిర్వహణకు వీరంతా అనుకూలంగా బోర్డులో తీర్మానం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి టీటీడీ నిధుల వినియోగంపై తిరుపతికి వచ్చి మరీ నిరసన తెలిపారు. బోర్డులోని బీజేపీ సభ్యులు ఆమోదం తెలిపి మీరెందుకు వ్యతిరేకిస్తున్నారన్న దానిపై ఆమె నోరు మెదపలేదు.

టీటీడీ తాను నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలను కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉన్నది. బీజేపీ ఒత్తిడికి తలొగ్గి ప్రజోపయోగ పనుల నుంచి వెనక్కి మళ్లటం చారిత్రక తప్పిదమవుతుంది. ప్రస్తుత టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలోని పాలకమండలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, భక్తులకు మేలు జరిగే వ్యవహారాలలో వెనక్కి తగ్గకుండా అమలు జరపాల్సిన అవసరం ఉన్నది.

- కందారపు మురళి, గౌరవాధ్యక్షులు,

టీటీడీ ఉద్యోగ, కార్మిక సంఘాలు,

94900 98840



Next Story