త్రివర్ణ పతాకపు స్ఫూర్తి చాటాలి!

by Ravi |
త్రివర్ణ పతాకపు స్ఫూర్తి చాటాలి!
X

డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర్య భారతంలో అణు పరీక్షలు, చంద్రయాన్, మంగళయాన్ వంటి ప్రయోగాల ఫలితాలతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెంది అగ్రదేశాలకు దీటుగా మనం ఎదిగాం. త్వరలోనే గగన్‌యాన్ ప్రయోగంతో నూతన చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాం. క్రికెట్ ఆటతో, విన్నూతనమైన సినిమాలతో విశ్వ వేదికలపై మన సత్తాను చాటాం. కానీ మనమంతా ఆందోళన చెందుతున్నది, 145 కోట్ల జనాభా కలిగిన దేశంలో మనం సాధించిన నోబెల్ బహుమతులు, ఒలింపిక్ పతకాల సంఖ్య గురించే..

----------------

జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు త్వరలో పారిస్‌లో జరగనున్న విశ్వ క్రీడా సంగ్రామం ఒలింపిక్స్ పోటీలకు ఈ సారి మన దేశం నుంచి 117 మంది అథ్లెట్లు మనదేశ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించడానికి మనందరి ఆశలు, బాధ్యతను మోస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించిన మనదేశం, ఈసారి డబుల్ డిజిట్ పతకాలపై ఆశలు పెట్టుకున్నాం. ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా ఒలింపిక్స్ కోసం ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం’ పేరుతో ప్రత్యేక పథకం ప్రారంభించి నైపుణ్యం, ప్రతిభ గల యువక్రీడాకారులను ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో మన ఆటగాళ్లకు శిక్షణ ఇప్పించి విశ్వ సమరానికి సిద్ధం చేశారు.

బ్రిటిష్ పాలన కాలంలోనే..

ఒకసారి మన ఒలింపిక్స్ పోటీలకు సంబంధించిన చరిత్రను గమనిస్తే.. అరకొర వసతులతో, ఆకలి బాధలతో బ్రిటిష్ పాలన కాలంలోనే మన జాతీయ క్రీడ హాకీలో స్వర్ణయుగం చూశాం. ప్రముఖ దిగ్గజ ఆటగాడు ధ్యాన్ చంద్ హయాంలో వరుసగా 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లో మన హాకీ టీం మూడు స్వర్ణాలు గెలిచింది. తర్వాత రాను రాను హాకీలో మనస్థాయి తగ్గింది. చివరిసారి మళ్లీ టోక్యో ఒలింపిక్స్‌లో హాకీలో కాంస్య పతకం సాధించాం. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో అభినవ్ బింద్రా స్వర్ణ పతకపు మెరుపులతో స్ఫూర్తిగా నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ చరిత్రలో తొలి పసిడి పతకాన్ని సాధించి నేటి ఆధునిక భారతయువతరానికి ఆదర్శమయ్యాడు. అలాగే మన తెలుగు అమ్మాయి పీ.వీ.సింధు బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు గెలిచి నేడు స్వర్ణ పతకమే లక్ష్యంగా పారిస్‌లో అడుగుపెట్టనుంది.

సరైన ప్రోత్సాహం లేకపోవడంతో..

కేవలం లక్షల సంఖ్యలో జనాభా కలిగి, సరైన వసతులు లేకున్నా.. ఆకలి, నిరుద్యోగం, నిరక్షరాస్యత వంటి మహామ్మారులతో పోరాడుతున్న చిన్న చిన్న దేశాల ఆటగాళ్లు స్వర్ణాలు గెలుస్తున్నారు. జమైకా దేశం తరపున ఉస్సేన్ బోల్డ్ పరుగుపందెంలో పసిడి కాంతులతో చూపిన ప్రతిభ యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. మన విద్యావ్యవస్థలో ఆటలు అంతర్భాగం అయినప్పటికీ సరైన మైదానాలు, వసతులు లేక, సరైన ప్రోత్సాహం కాగితాలకే పరిమితం అయ్యింది. యువతరం కూడా ‘ఆటలు మనకు అన్నం పెట్టవు కదా..!’ అనే ధోరణిలో బతుకాటలో, ఉద్యోగవేటలో జీవితాలను నెట్టుకొస్తున్నారు. ఇక ప్రతిభ, నైపుణ్యాలను కలిగి వున్న యువతను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు రాజకీయంతో ఆటలు ఆడిస్తున్నాయి. ఏదేమైనా ఆటల్లో మనదేశం రాణించాలంటే మన ఆలోచనలు, విద్యా సంస్థల దృక్పథాలు, ప్రభుత్వాల విధానాలు ఇలాంటివి చాలా మారాల్సిందే. మనమంతా మార్చుకోవాల్సిందే. ప్రతిభా నైపుణ్యాలు కలిగిన ఆటగాళ్లకు అవార్డులతో పాటు, ఆర్థిక సాయం అందించి జీవన భరోసా కలుగజేస్తే మళ్లీ మనం ఒలింపిక్స్ లాంటి పోటీల్లో అగ్రదేశాలకు దీటుగా ఎదగగలం.

ప్రపంచానికి దిక్సూచి కావాలి!

ఎన్ని సమస్యలు, సవాళ్లు మన ముందు ఉన్నా ఇప్పుడు మనదేశం నుంచి పారిస్‌కు వెళ్తున్న క్రీడాకారులకు మనమంతా నైతిక మద్దతు, ప్రోత్సాహం అందిద్దాం. ఈ ఒలింపిక్స్‌లో మన తెలుగు రాష్ట్రాల నుంచి 8 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ, ఇషా సింగ్, పీ.వీ సింధు, సాత్విక్, దండి జ్యోతిక శ్రీ, బొమ్మ దేవర ధీరజ్‌లు ఒత్తిడి అధిగమిస్తూ చివరివరకు పోరాడి తమ పతకాల వెలుగుతో మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని మనమంతా ఆశిద్దాం. రంగం ఏదైనా ఈ ప్రపంచానికి భారతదేశం దిక్సూచి కావాలి. ఆల్ ది బెస్ట్ ఇండియా.

Read More..

క్రీడా కురుక్షేత్రమే ఒలింపిక్స్

-ఫిజిక్స్ అరుణ్ కుమార్

93947 49536



Next Story