బలమైన ప్రతిపక్షం దేశానికి ప్రయోజనం!

by Ravi |   ( Updated:2024-06-06 01:00:36.0  )
బలమైన ప్రతిపక్షం దేశానికి ప్రయోజనం!
X

2024 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు దారి చూపారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఉపయోగించిన బై బై పదానికి ఇప్పుడు ప్రాధాన్యత ఏర్పడింది. చిత్రంగా కనిపించినా, నిజమే కదా అనిపిస్తుంది. తెలంగాణలో బై బై కేసీఆర్, ఆంధ్రలో బై బై జగన్, దేశంలో అనేక ప్రాంతాల్లో బై బై మోడీ అనే పదాలు రాహుల్ గాంధీ నోట పలు మార్లు వెలువడ్డాయి. ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే జరిగింది కూడా అదే. యాదృచ్ఛికంగా అయినా అదే నిజమైనట్లు కనపడుతుంది.

ఈ ఎన్నికల్లో అయోధ్య పైన ఆశలు, ముస్లింలపై వ్యతిరేకత, రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగ సవరణ వంటి అంశాలు బీజేపీని ఇరకాటంలో పెట్టాయనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అందుకేనేమో, ఆ పార్టీకి సింగిల్ మెజారిటీతో అధికారం పొందే సూచనలు కనుమరుగయ్యాయి. అదానీ అంబానీలకు దేశ సంపదను కారు చౌకగా కట్టబెడుతున్నారనే ప్రచారం కూడా వ్యతిరేకతను పెంచింది. బలమైన ప్రతిపక్షం ఉండడం దేశానికి హితకరమేనని చెప్పాలి.

ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే ఫలితాలు..

అయోధ్యలో బీజేపీ ఓడిపోవడం, కాంగ్రెస్ అభ్యర్థి గెలవడంతో మతాన్ని అడ్డుపెట్టుకొని అధికారం సాధించుకుందాం అనే ఆలోచనకు గండి పడింది. రాజ్యాంగంలోని సమానత్వం, సెక్యులరిజం పదాలను తొలగిస్తామనే హామీని మెజారిటీ ప్రజలు వ్యతిరేకించారన్నది స్పష్టమైనది. పనిగట్టుకుని చేసిన ముస్లిం వ్యతిరేక ప్రచారం ఇండియా కూటమికి కలిసి వచ్చింది. వెరసి దేశంలో సంకీర్ణ పాలనకు తెర లేచిందనే చెప్పాలి. దక్షిణాదిలో బలహీనపడిన ప్రాంతీయ పార్టీల స్థానాలను, బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. నిజానికి ఇది బీజేపీ బలం కాదన్నది నిర్వివాదాంశం. బీహార్‌లో నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వాల్లో కీలక భూమిక పోషించే అవకాశం ఏర్పడింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం, బలమైన ప్రతిపక్షం ఉండడం ప్రజలకు మేలు చేసే అంశాలే. కాకపోతే ఇది కొత్త పాలకులకు నిత్యం కత్తి మీద సాములా ఉంటుంది. ఆచితూచి నిర్ణయం తీసుకోవడం, అందరి అభిప్రాయాలను గౌరవించడం అవసరమవుతుంది. ఒక రకంగా ప్రజాస్వామ్యానికి కొంత ఊతం ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యం పరిఢమిల్లాలని కోరుకున్న ప్రజల ఆకాంక్షకు ఈ ఎన్నికలు అద్దం పట్టాయనే చెప్పాలి. తాత్కాలికంగా జరగబోయే రాజకీయ పరిణామాలను పరిశీలించడమే తప్ప దేశ ప్రజల ముందు మరో ప్రత్యామ్నాయం ఏదీ లేదు.

ప్రజల సమస్యలకు పరిష్కారం చూపకపోతే..

తెలంగాణ విషయానికొస్తే రాహుల్ గాంధీ ఇటీవల జరిపిన భారత్ జోడో యాత్రలో, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సందర్బంలో పౌర హక్కుల నేతలు, ఉద్యమ కారులు, బుద్ధి జీవులతో పలు అంశాలపై చర్చించారు. మరీ ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో పాలకుల నిరంకుశ విధానాలపై సమాలోచనలు చేసినట్లు తెలిసింది. వారంతా పాలనా విధానాలపై పలు కీలక అంశాలపై సంకేతాలు చేశారు. వాటిలో అనేక అంశాలు ఇంకా ఆచరణకు నోచుకోకున్నా, పరిస్థితిలో కొంత మార్పు ఉన్నాదనే అభిప్రాయం మాత్రం ఏర్పడిందనే చెప్పాలి. స్వేచ్ఛ, స్వాతంత్ర్య ఆకాంక్షలు, ఆత్మ గౌరవానికి ప్రాధాన్యతనిచ్చే ప్రజలలో అసంతృప్తి మిగిలే ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలను తెరిపించడం, కాలుష్య పరిశ్రమల అనుమతుల రద్దు, ఉద్యమ కారులపై అక్రమంగా మోపిన కేసులు ఎత్తివేయడం, ఉద్యోగ నియామకాలు, విద్య -వైద్యం ఉచితంగా అన్ని వర్గాలకు అందించడం, న్యాయ వ్యవస్థలో, విద్యా రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలు ,పౌర ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ లాంటి అంశాలు అసంపూర్ణంగా మిగిలే ఉన్నాయి. ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయకపోతే మరిన్ని ప్రజాస్వామిక ఉద్యమాలకు బలమైన పునాదులు ఏర్పడుతాయి.

- రమణాచారి

99898 63039

Advertisement

Next Story