ప్రజలను హెచ్చరించిన కలెక్టర్.. ఎందుకో తెలుసా..?

by Shyam |   ( Updated:2021-07-22 02:20:40.0  )
mahabub nagar news
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కృష్ణానదికి భారీ మొత్తంలో వరదనీరు వస్తున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి పాలమూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు గురువారం ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయని, గతంలో నిర్మించిన మట్టి మిద్దెలు కూలిపోయే పరిస్థితుల్లో ఉంటాయని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, గద్వాల జోగులాంబ జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. కర్ణాటక నారాయణపుర ప్రాజెక్టు నుండి లక్షా ఇరవై వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడం, దానికి వర్షం నీరు చేరి, కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని వారు పేర్కొన్నారు.

జిల్లా అధికార యంత్రాంగం 24 గంటలు అందుబాటులో ఉండి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నద్ధం గా ఉండాలని వారు పిలుపునిచ్చారు. ప్రత్యేకించి కృష్ణా నది తీర ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు, మత్స్యకారులు మరింత అప్రమత్తంగా ఉండాలని వారు విజ్ఞప్తి చేశారు. అధికారులకు తోడు ప్రజా ప్రతినిధులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఎం రామ్మోహన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎటువంటి సహాయం అందించడానికైనా సిద్ధంగా ఉండాలని వారు కోరారు.

Advertisement

Next Story

Most Viewed