టీచర్‌ ఉద్యోగం కంటే కానిస్టేబుల్ చాలా రిస్క్‌ : గోపిరెడ్డి

by Shyam |
టీచర్‌ ఉద్యోగం కంటే కానిస్టేబుల్ చాలా రిస్క్‌ : గోపిరెడ్డి
X

దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టును ఎస్‌జీటీ క్యాడర్ హోదాకు అప్ గ్రేడ్ చేయాలని, ఎస్ఐలకు గెజిటెడ్ హోదా కల్పించాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి‌తో కలిసి రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు వై.గోపిరెడ్డి శుక్రవారం సీఎస్ సోమేష్ కుమార్‌ను కలిసి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సదర్భంగా సీఎస్ సోమేష్ కుమార్‌తో డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోపిరెడ్డి డిపార్టమ్మెంటల్ సమస్యలను దాదాపు అరగంట సేపు వివరించారు. అనంతరం గోపిరెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల పోస్టు అర్హతలు, విదాశాఖలోని ఎస్‌జీటీ టీచర్లకు నియామకం అర్హతలు సమానంగా ఉంటాయని అన్నారు. ఎస్‌జీటీలు టీటీసీ ట్రైనింగ్ తో నియామకం అయితే.. సెలక్షన్ తర్వాత కానిస్టేబుళ్లకు ట్రైనింగ్ ఉంటుందన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగం చాలా రిస్క్‌తో కూడుకున్నదిగా ఉంటుందన్నారు. అంతే కాకుండా, టీచర్ల కంటే కానిస్టేబుళ్లకు విధుల్లో వర్క్ లోడ్ అత్యధికంగా ఉంటుందని వివరించారు.

ఈ నేపథ్యంలో పోలీస్ శాఖలోని కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఇన్ స్పెక్టర్ స్థాయిలో ప్రస్తుతం ఉన్న పే స్కేల్స్‌ను పెంచాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఈ క్రమంలో కానిస్టేబుళ్లకు రూ.16,400 నుంచి రూ.21,230 లకు, హెడ్ కానిస్టేబుల్‌కు రూ.21,230 నుంచి రూ.24,440 లకు, ఏఎస్ఐలకు రూ.23,100 నుంచి రూ. 28,940 లకు, ఎస్ఐలకు రూ.28,940 నుంచి రూ.31,460 లకు, ఇన్ స్పెక్టర్లకు 35,120 నుంచి రూ.37,100 లకు బేసిక్ పే స్కేల్ ను పెంచాలన్నారు. గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా ఎస్ఐ స్థాయి అధికారులకు గెజిటెడ్ హోదా కల్పించాలన్నారు. విధుల్లో భాగంగా ప్రతి కానిస్టేబుల్‌కు ప్రతినెలా 30 లీటర్ల పెట్రోల్ మంజూరు చేయాలన్నారు. పోలీసు ఉద్యోగం చాలా రిస్క్ తో కూడుకున్నది కావడంతో పోలీసులకు పలు సందర్భాల నేపథ్యంలో లైఫ్ అంతా రౌడీలు, గుండాలు, తీవ్రవాదులు, వివిధ ప్రజా సమూహాల నుంచి రిస్క్ ఉంటుందన్నారు.

ఈ క్రమంలో పోలీసులకు వారి వేతనంలోని 15 శాతాన్ని లైఫ్ రిస్క్‌ను ప్రభుత్వం మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం అందిస్తున్న యూనిఫాం అలవెన్స్ ను పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ.7500 నుంచి రూ.11,610 పెంచాలన్నారు. కిట్ మెయింటెనెన్స్‌ను నెలకు రూ.1000 లు మంజూరు చేయాలన్నారు. పోలీసు కుటుంబాలకు ప్రతీ సంవత్సరం ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్ చేయించాలని కోరారు. ఈ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని సీఎస్ సోమేష్ కుమార్ హామీ ఇచ్చినట్టు గోపిరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ జితేందర్, అడ్మిన్ అడిషనల్ ఐజీ వెంకటేశ్వర్లు సీఐడీ యూనిట్ అధ్యక్షులు మల్లికార్జున్, చీఫ్ లైజన్ ఆఫీసర్ కె.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed