జాతీయ విద్యా విధానంతో తీరని నష్టం

by Shyam |
జాతీయ విద్యా విధానంతో తీరని నష్టం
X

దిశ, న్యూస్​బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ విద్యా విధానం విద్యా వ్యవస్థలోని అంతరాలను మరింత పెంచేదిగా ఉందని, ప్రైవేటు, కార్పొరేట్ విద్యావ్యాపారం పెరిగి పేదలకు విద్య మరింత దూరమవుతుందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. “జాతీ య నూతన విద్యా విధానం- మంచి, చెడు” అనే అంశంపై తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్​యూటీఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం వర్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య అధ్యక్షత వహించగా, ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి జాతీయ విద్యా విధానంలోని ముఖ్యాంశాలను వివరించారు.

ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ ముసాయిదాకు ప్రస్తుతం ఆమోదించిన పత్రానికి పెద్దగా తేడా లేదన్నారు. ప్రజల సూచనలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఈ విద్యా విధానం గ్లోబల్ సిటిజన్ పేరుతో ప్రపంచ మార్కెట్​కు నైపుణ్యం కలిగిన కార్మికులను అందించేదిగా ఉందన్నారు. ప్రభుత్వ రంగంలో ధార్మిక సంస్థలకు, ప్రైవేటు సంస్థలకు సమాన అవకాశాలు కల్పించటం అంటే తమ అనుకూల కార్పొరేట్ శక్తులను విద్యారంగంలోకి తీసుకు రావటమేనని విమర్శించారు. కేంద్ర బడ్జెట్​లో 10%, రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులను విద్యకు కేటాయించాలన్న కొఠారి సూచనను విస్మరించారని అన్నారు. కామన్ స్కూల్ విధానం ద్వారా మాత్రమే అంతరాలు లేని విద్యావ్యవస్థ సాకారమవుతుందన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story