హైదరాబాద్‌లో భయంకర ఘటన.. ట్రాన్స్‌జెండర్‌ను కిరాతకంగా హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు

by Satheesh |   ( Updated:2024-07-12 13:33:45.0  )
హైదరాబాద్‌లో భయంకర ఘటన.. ట్రాన్స్‌జెండర్‌ను కిరాతకంగా హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వరుస హత్యలు నగరవాసులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. గడిచిన నెల రోజుల్లోనే హైదరాబాద్‌లో దాదాపు 20పైగా మర్డర్లు వెలుగుచూశాయి. ఇదిలా ఉండగానే.. తాజాగా హైదరాబాద్‌లో మరో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ ట్రాన్స్ జెండర్‌ను కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన సనత్ నగర్ పీఎస్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. హైదరాబాద్ సనత్ నగర్‌లోని ఫతేనగర్ పిట్టల బస్తీలో ఓ ట్రాన్స్‌జెండర్‌ను దుండగులు దారుణంగా హతమార్చారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి పరార్ అయ్యారు.

నిర్మానుష్య ప్రాంతంలో డెడ్‌బాడీని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. హత్యకు గల కారణాలు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ట్రాన్స్ జెండర్‌ను షీలాగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు గంజాయి మత్తులో హత్య చేసి ఉంటారని తోటి ట్రాన్స్ జెండర్లు అంటుండగా.. డబ్బు కోసం హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివిధ కోణాల్లో విచారణ మొదలుపెట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed