దొంగల బీభత్సం.. ఒకే రోజు 3 ఇళ్లలో చోరీ

by Rajesh |
దొంగల బీభత్సం.. ఒకే రోజు 3 ఇళ్లలో చోరీ
X

దిశ, హుజూర్‌నగర్/‌గరిడేపల్లి : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ కు సమీపంలోని మూడు ఇండ్లలో బుధవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసిన ఇండ్లను గుర్తించి వాటిని టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడ్డారు. ఏకంగా ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న మూడు ఇండ్లలో చొరబడిన దొంగలు రూ.2.10 లక్షల నగదు, 5 తులాల బంగారం చోరీ చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గరిడేపల్లికి చెందిన యనమదల రామచందర్ రాజు గత పదేళ్లుగా తన కూతురు బెంగళూరులో ఉండడంతో తన ఇంటికి తాళం వేసుకొని అక్కడికి వెళ్ళాడు.

బుధవారం తిరిగి వచ్చిన ఆయన ఇంటి తలుపు తాళం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. బీరువాలో ఉన్న రూ.2.10 లక్షల నగదును దొంగలించినట్లు తెలిపాడు. అలాగే గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి హై స్కూల్‌లో రికార్డు అసిస్టెంట్‌గా కోదాడకి చెందిన ఖాజా మొయినుద్దీన్ పనిచేస్తున్నారు. గరిడేపల్లి ఓ ఇంట్లో కిరాయికి తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. బుధవారం మొహరం పండగ కావడంతో తన సొంత ఊరైన కోదాడకు కుటుంబ సభ్యులతో వెళ్లారు. ఇంటికి తాళం ఉండటాన్ని గుర్తించిన దొంగలు ఇంట్లో చొరబడి బీరువా తాళం పగలగొట్టి అందులోని ఐదు తులాల బంగారాన్ని దొంగలించారు.

అలాగే గట్టికోప్పుల సత్యనారాయణ రెడ్డి హాస్పిటల్ చికిత్స కోసం హైదరాబాద్ వెళ్ళగా ఆయన ఇంటి తాళం పడగొట్టి దొంగతనానికి పాల్పడ్డారని తెలిపాడు. కానీ వారింట్లో ఎటువంటి ఆభరణాలు, వస్తువులు, డబ్బులు గానీ పోలేదని సమాచారం. ఈ సంఘటన జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఒకే రోజు మూడు ఇళ్లలో చోరీ జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే మోటార్ల దొంగతనాలు జరిగాయని రైతులు భయాందోళన చెందుతుంటే ఇలా రాత్రి వేళలో ఇండ్లలో చొరబడి కూడా దొంగలు దొంగతనాలు పాల్పడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు వెంటనే నిఘా పెంచి దొంగలను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దొంగలను కఠినంగా శిక్షంచాలని డిమాండ్ చేస్తున్నారు.



Next Story