వినాయక నిమజ్జనంలో దారుణం.. డీజే ఆపరేటర్‌పై కత్తితో దాడి

by Shiva |
వినాయక నిమజ్జనంలో దారుణం.. డీజే ఆపరేటర్‌పై కత్తితో దాడి
X

దిశ, ఘట్కేసర్: వినాయక నిమజ్జన వేడుకల్లో డీజే ఆపరేటర్‌ను ఓ యువకుడు కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఘట్కేసర్ పట్టణం ఈడబ్ల్యూఎస్ కాలనీలోని గురుకుల కళాశాల ఎదురుగా డైమండ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి మొదలైన వినాయక నిమజ్జన వేడుకలు శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. ఈ క్రమంలోనే ఘట్‌కేసర్‌కు చెందిన బైర్ల మహేందర్ అనే యువకుడు డీజే ఆపరేటర్ సాయిని కత్తితో పొడిచి పరారయ్యాడు. అదేవిధంగా అక్కడే ఉన్న సాయి భార్యను కూడా విచక్షణారహితంగా మహేందర్ కొట్టినట్లుగా తెలిసింది.

అనంతరం అక్కడి నుంచి పరారైన మహేందర్ ఘట్‌కేసర్ పట్టణంలోని మరో వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొని అక్కడ యువకులపై దాడికి పాల్పడుతుండగా పోలీసులకు సమాచారం అందజేశారు. అయితే, అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులను కూడా ముప్పుతిప్పలు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులకు గాయాలైనట్లు సమాచారం. డీజే ఆపరేటర్ సాయి ప్రేమ వివాహమే కత్తిపొట్లకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. సంవత్సరం క్రితం మహేందర్ సోదరిని సాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కక్షతో హత్యాయత్నం చేసి ఉంటాడని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కత్తిపొట్లకు గురైన సాయిని చికిత్స నిమిత్తం కీసరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed