నా కొడుకు చావుకు ఆ ముగ్గురే కారణం

by Sridhar Babu |
నా కొడుకు చావుకు ఆ ముగ్గురే కారణం
X

దిశ, మానకొండూరు : నా కొడుకు చావుకు ఆ ముగ్గురే కారణం అని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మానకొండూర్ పోలీసులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెల్ది గ్రామానికి చెందిన ఇల్లందుల నాంపెల్లి- భాగ్యలక్ష్మికి ఒక కుమారుడితో పాటు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వీరి కుమారుడు ఇల్లందుల త్రినాథ్ అలియాస్ సన్ని(19) శనివారం మధ్యాహ్నం తన మిత్రులు కొమ్మగల్ల కిరణ్, రుద్రారం స్వస్తిక్ అలియాస్ తిలక్ తో కలిసి తన తండ్రి ఆటోలో రంగపేటకు ఓ ప్యాంట్ ఆల్ట్రేషన్ చేయించుకునేందుకు వెళ్లారు. దాంతో సాయంత్రం తండ్రి నాంపల్లి తన కుమారుడికి ఫోన్ చేయగా తాము ముగ్గురం ఉన్నామని, కొంత సేపటికి వస్తామని చెప్పాడు.

అనంతరం రాత్రి 7 గంటల సమయంలో సన్నీ తండ్రికి స్వస్తిక్ ఫోన్ చేసి మీ కొడుకు రంగపేటలోని వ్యవసాయ బావిలో పడిపోయినట్లు సమాచారం అందించాడు. వెంటనే సంఘటనా స్థలానికి మృతుడి తండ్రి, బంధువులు చేరుకున్నారు. అక్కడ మరో వ్యక్తి రామగిరి సందీప్ తో పాటు కొమ్మగళ్ల కిరణ్ ఉన్నారు. రాత్రి కావడంతో సహాయక చర్యలు చేపట్టలేదు. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తన కుమారుడి మృతికి ముగ్గురు యువకులు కారణమని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మానకొండూర్ సీఐ తెలిపారు.

Advertisement

Next Story