ఆన్​లైన్​ బెట్టింగ్స్​కు ఓ యువకుడి బలి..

by Sumithra |
ఆన్​లైన్​ బెట్టింగ్స్​కు ఓ యువకుడి బలి..
X

దిశ, బడంగ్​పేట్ :​ ఆన్​లైన్​ బెట్టింగ్స్​ ఓ కుటుంబంలో తీరనివిషాదం మిగిల్చింది. చేతికి అందివచ్చిన చెట్టంత కొడుకును ఆన్​లైన్​ బెట్టింగ్స్​ బలితీసుకుంది. బీరువాలో దాచిన బంగారం కూడా కుదవపెట్టి బెట్టింగ్స్​లో ఓడిపోవడం... బీరువాలో దాచిన బంగారం తల్లికి కనిపించక నిలదీయడంతో తీవ్రమనస్థాపానికి చెందిన పెద్ద కొడుకు వేప చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన ఆదివారం తెల్లవారు జామున పహాడిషరీఫ్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో తీవ్రకలకలం రేపుతుంది. పహాడిషరీఫ్​ ఎస్సై వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం. మామిడిపల్లికి చెందిన చంద్రయ్య, శశికళ దంపతులకు ముగ్గురు కుమారులు.

పెద్దకుమారుడు రాజశేఖర్​ (26) ఇంటర్మీడియట్​ వరకు చదివి, గత కొంత కాలంగా శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​లో ప్రయివేట్​ ఉద్యోగం చేస్తున్నాడు. గతసంవత్సరం కాలంగా రాజశేఖర్​ ఆన్​లైన్​లో ప్లేయింగ్​ కార్డ్స్​, క్రికెట్​ బెట్టింగ్​లు ఆడేవాడు. ఆన్​లైన్​ బెట్టింగ్స్​కు భానిసై సంవత్సర కాలంలోనే మూడు నుంచి నాలుగు లక్షల వరకు డబ్బులు పోగొట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా తల్లి శశికళ బీరువాలో దాచిపెట్టిన బంగారంను సైతం కుదవపెట్టి ఆన్​లైన్​ బెట్టింగ్​లు ఆడి ఓడిపోయాడు. ఇదిలా ఉండగా శివరాత్రి సందర్భంగా తల్లి శశికళ ఈ నెల 18వ తేదీన సాయంత్రం 4గంటలకు బీరువాను సదరుతుండగా అందులో దాచిపెట్టిన తులంనర బంగారం కనిపించలేదు. దీంతో తనభర్తతో పాటు ముగ్గురు పిల్లలను అడిగింది. అలాగే పెద్దకొడుకును కూడా నువ్వే తీశావా? అని గట్టిగా నిలదీసింది.

దీంతో తాను తీసుకోలేదని నైట్​ డ్యూటికని శనివారం రాత్రి శంషాబాద్​ ఎయిర్​ పోర్ట్​కు వెళ్లాడు. తాను తప్పుచేశానని, ఆ బంగారం తానే తీసుకున్నానని, ఆన్​లైన్​ లో బెట్టింగ్​లు ఆడిపోగొట్టుకున్నానని, శంషాబాద్​లో ఓ వ్యక్తి దగ్గర 40వేలకు కుదవపెట్టానని, దానికి సంబంధించిన స్లిప్​లు తన మొబైల్​ పోచ్​ వెనుక ఉన్నాయని, తాను చనిపోతునానని, ఇక తల్లిని, తండ్రిని మంచిగా చూసుకోవాలని తన సోదరుడికి ఆదివారం తెల్లవారుజామున 2.44 గంటలకు మెసేజ్​ చేశాడు. తండ్రి చంద్రయ్య ఎప్పటిలాగానే ఉదయం 5గంటలకు పాలు పిదకడానికి షెడ్డు వద్దకు వెళ్లాడు. అక్కడ ఓ వేపచెట్టుకు పెద్దకుమారుడు రాజశేఖర్​ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకొని ఉండడం కనిపించింది. తండ్రి, స్థానికుల సమాచారంతో పహాడిషరీఫ్​ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ కేసును పహాడిషరీఫ్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed