ప్రశ్నించే లీడర్లే సైలంటయ్యారు!

by  |
ప్రశ్నించే లీడర్లే సైలంటయ్యారు!
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి:

పల్లెలు, పట్టణాల్లో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారితో ప్రజల బతుకులు ఛిద్రమైపోతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుం బాలు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉద్యోగం, ఉపాధిలేక కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నా యి. కులవృత్తులకు ప్రభుత్వం ప్రోత్సహకాలు అందడం లేదు. సంక్షేమ పథకా లు అమలులో తీవ్ర జాప్యం నెలకొంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ నాయకులపై ఆధారపడి విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చేయితడపందే పనులు జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యసేవలు అందక అనేకమంది పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజా సమస్యలపై గొంతెత్తాల్సిన ప్రతిపక్షాలు మూగ నోము చేస్తున్నాయి.

ఇదే సమస్యల సమయం..

ఒకవైపు కరోనా.. మరో వైపు సీజనల్ వ్యా ధులతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లిన రోగులను తిప్పి పంపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలని ప్రైవేట్ వైద్యులే సూచిస్తున్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. సరైన సౌకర్యాలు, మందులు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కష్టకాలంలో ప్రజాసమస్యలపై మాట్లాడే నాయకులు రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలో కరువయ్యారు. ఆ నాయకులు తమ అవసరాల కోసం అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై సొంత వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు జంకుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో ప్రజా సమస్యలు అధికంగా ఉన్నాయి. మున్సిపాలిటీలో పారిశుధ్యం కొరవడి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.

సోషల్ మీడియాలో హల్చల్..

జిల్లాలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు సోషల్ మీడియా, మీడియా ముందు హల్చల్ చేస్తున్నారు. కానీ, ఏడాదిగా ప్రజా సమస్యలపై గళమెత్తింది శూన్యం. కేవలం కేంద్ర, రాష్ట్ర కమిటీల పిలుపు మేరకే నిరసనలు, ధర్నాలు, ర్యాలీలకు పరిమితమయ్యారు. ఎక్కడో అన్యాయం జరిగిందని కేంద్ర, రాష్ట్ర కమిటీ పిలుపునిస్తే స్పందించే నాయకులు తమ ప్రాంతాల్లో జరిగే అన్యాయాలు, అక్రమా లు, అధికార పార్టీ నాయకుల ఆగడాలపై స్పందించేందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. లీడర్​గా మార్కెట్లో చలామణి కావడం తప్ప ప్రజాసమస్యలను పట్టించుకున్న పాపాన పోవడం లేదని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల్లో సరియైన నాయకుడు లేకపోవడంతోనే అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు.

కాంగ్రెస్​లో పోటీకి పోటాపోటీ..

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉండేది. ఏ ఎన్నికలు వచ్చినా బరిలో నిలిచేందుకు ఆశావహులు అధికంగానే ఉంటారు. ఆశించిన వ్యక్తులకు అవకాశం రాకుంటే ఆ పార్టీ అభ్యర్థిని వారే ఓడించేందుకు కార్యాచరణ చేసుకుంటారు. ప్రజలను ఓటరుగా గుర్తించి పోటీకి సై అంటారు. కానీ ప్రజా సమస్యలపై పోరాటానికి ఎవరూ ముందుకురారు. ప్రజా సమస్యలపై స్పందించకు న్నా పార్టీ పిలుపునకు సైతం పనిచేసేందుకు నాయకులు బయటికి రారు. ఎన్ని పైరవీలు చేసైనా పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బలమైన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇందులో మాజీ మంత్రులు, మూడు, నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన నాయకులు ఉన్నారు.

అంతో ఇంతో ప్రజాదరణ కలిగిన నాయకులు ఉన్నారు. వీరంతా ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రమే వస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. రంగా రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించే నాయకుడికి పెద్దగా జిల్లాలో పట్టులేదని, ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే శక్తి లేదని, పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాలను చేపట్టడంలో ముందంజలో ఉంటా డని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. వికారాబాద్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు రాంమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వశ్వేర్ రెడ్డి మాత్రమే పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నారు. కానీ, మాజీ మంత్రులైన ప్రసాద్ కుమార్, చంద్రశేఖర్​ మీడియా సమావేశాలకు తప్ప పార్టీ పిలుపుతో స్థానిక సమస్యలపై పోరాటం చేసిన దాఖలాలు లేవని ఆ జిల్లా నాయకులే ఆరోపిస్తున్నారు.

బీజేపీ పిలుపుకే సై…

రంగారెడ్డి జిల్లాలో బీజేపీ బలోపేతం కోసం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆ పార్టీ ప్రజాప్రతినిధులుగా ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాం తాల్లో అధికార పార్టీ చేసే దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసేందుకు పోరాటాలు చేస్తోం ది. ఇటీవలి కాలంలో యాచారం ఎంపీపీ బీజేపీ కావడంతో టీఆర్ఎస్ కొంత ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపణలు వచ్చాయి. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించిన భూ పరిహారంలో రైతులకు నష్టం జరిగిందని అధికార పార్టీని ప్రశ్నిం చారు. క్యాడర్ లేని ప్రాంతాలపై బీజేపీ పోరాటాలు చేసిన సంఘటనలూ తక్కువేనని చెప్పాలి. అంతో ఇంతో సమస్యలపై స్పందించి పోరాడే వామపక్ష పార్టీల పరిస్థితి అలాగే ఉంది.

ప్రతిపక్షాల బలహీనతే పాలకపక్షానికి బలం..

జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు బలంగా లేకపోవడంతోనే పాలక పక్షానికి కలిసి వచ్చిం ది. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులకు ఆ పార్టీల నాయకులు భరోసా కల్పించకపోవడంతో వెనకడుగు వేస్తున్నా రు. మీ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీలో చేరాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆఫర్లు ఇస్తున్నా రు. ఆ ఆఫర్లను నమ్మి అధికార పార్టీలో చేరిన తర్వాత వ్యక్తిగత ప్రయోజనాలకే స్థానిక ప్రజాప్రతినిధులు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నాయకులతో గొడవెందుకని అవకాశాల కోసం పనిచేస్తున్నారు. జిల్లాలో అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు విలువలేకపోయినా, ప్రజలకు సేవచేయాలనే గుణ మున్న నాయకులు సైతం చేసేదేమీ లేక నిమ్మకుండి పోతున్నారు. దీంతో అధికార పార్టీ నాయకులు చేసిందే పని, చెప్పిందే వేదంలా మారింది.


Next Story

Most Viewed