Cement:7-8 శాతం పెరగనున్న సిమెంట్ డిమాండ్: అల్ట్రాటెక్

by Harish |
Cement:7-8 శాతం పెరగనున్న సిమెంట్ డిమాండ్: అల్ట్రాటెక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా నిర్మాణ కార్యకలాపాలు పెరగడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ డిమాండ్ 7-8 శాతం పెరుగుతుందని భారతదేశపు అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీ అల్ట్రాటెక్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. పెరుగుతున్న ఈ డిమాండ్‌ను తీర్చడానికి సిమెంట్ పరిశ్రమ ఆర్థిక సంవత్సరంలో 35-40 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని అందించగలదని నివేదికలో తెలిపింది. పరిశ్రమ సామర్థ్య వినియోగం ఎఫ్‌వై25లో 72 శాతానికి పెరుగుతుంది అంచనా వేయగా, ఇది ఎఫ్‌వై23లో 68 శాతంగా ఉంది.

గ్రామీణ డిమాండ్ ఊపందుకోవడం, దేశవ్యాప్తంగా, ముఖ్యంగా బీహార్, అమరావతి, ఇతర ప్రాంతాల్లో నిర్మాణ కార్యకలాపాలు పుంజుకోవడం, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి కూడా అత్యంత సానుకూలంగా ఉండటంతో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎన్నికలు కూడా ముగిసిపోవడం కేంద్రంలో స్థిర ప్రభుత్వం ఏర్పడటంతో దేశంలో పలు నగరాలు, పట్టణాల్లో నిర్మాణాలు పెరుగుతున్నాయి. దీంతో సిమెంట్ డిమాండ్ కూడా పెరుగుతుందని అల్ట్రాటెక్ కంపెనీ పేర్కొంది.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్ రంగాల నుండి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, భారతీయ సిమెంట్ పరిశ్రమ కొత్త ఉత్పత్తి సామర్థ్యాలను జోడించడానికి సిద్ధంగా ఉందని కంపెనీ అధికారులు తెలిపారు. అంతకుముందు కంపెనీ వాటాదారులను ఉద్దేశించి ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా మాట్లాడుతూ, భారతదేశ మౌలిక సదుపాయాల రంగం "అద్భుతమైన వృద్ధికి" సిద్ధంగా ఉందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అల్ట్రాటెక్ సిమెంట్ రూ. 69,810 కోట్ల నికర అమ్మకాలను నమోదు చేసింది.

Advertisement

Next Story