మొదటి త్రైమాసికంలో 16 శాతం పెరిగిన వాహనాల అమ్మకాలు

by Harish |   ( Updated:2024-07-12 09:18:16.0  )
మొదటి త్రైమాసికంలో 16 శాతం పెరిగిన వాహనాల అమ్మకాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమ భారీ వృద్ధిని కనబరుస్తుంది. కరోనా తరువాత ఆర్థిక స్థిరత్వం లభించడం, పరిశ్రమల్లో ఉత్పత్తి పెరగడంతో వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా కూడా మెరుగవడంతో వాహనాల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీ(సియామ్) నుంచి ఇటీవల వచ్చిన నివేదిక ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశీయ మార్కెట్లో మొత్తం వాహనాల అమ్మకాలు 64,01,006 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 54,98,602 యూనిట్లతో పోలిస్తే, అమ్మకాలు 16.4 శాతం పెరిగాయి.

ఇదే సమయంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు కూడా వృద్ధి చెందాయి. మొత్తం అమ్మకాల్లో దేశీయ మార్కెట్లో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు(పీవీ) 10,26,000 యూనిట్లుగా ఉన్నాయి. ఇది గత ఏడాది 9,96,565 యూనిట్లతో పోలిస్తే 3 శాతం పెరిగింది. పీవీ అమ్మకాలలో ఎక్కువగా యుటిలిటీ వెహికల్స్ (UVలు)కు బలమైన డిమాండ్ నెలకొంది. ఇది మొత్తం అమ్మకాల్లో దాదాపు 63 శాతం వాటాను కలిగి ఉంది. వాహనాల అమ్మకాలు పెరగడానికి ఎక్కువ భాగం యూవీ వాహనాలు తోడ్పాటు అందించాయి. యుటిలిటీ వెహికల్స్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5,47,194 యూనిట్లు కాగా ఉండగా, ఇప్పుడు అది, 6,45,000 యూనిట్లకు పెరిగి 18 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Advertisement

Next Story