వరుస ఎనిమిది రోజుల లాభాలకు బ్రేక్!

by Harish |
వరుస ఎనిమిది రోజుల లాభాలకు బ్రేక్!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస లాభాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయ దిగ్గజ రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలను దెబ్బతీశాయి. బుధవారం ఉదయం నుంచే నష్టాలతో మొదలైన ట్రేడింగ్ రోజంతా అదే ధోరణిలో కదలాడాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లకు సంబంధించి ప్రకటన విడుదలకు ముందు మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో దేశీయ ఈక్విటీలు వరుస లాభాల నుంచి పతనమయ్యాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 161.41 పాయింట్లు కుదేలై 61,193 వద్ద, నిఫ్టీ 57.80 పాయింట్లు నష్టపోయి 18,089 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, మీడియా, రియల్టీ రంగాలు రాణించగా, బ్యాంక్, మెటల్ రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్, టాటా మోటార్స్, అల్ట్రా సిమెంట్, ఐటీసీ, నెస్లే ఇండియా కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఎల్అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 81.81 వద్ద ఉంది.

Advertisement

Next Story