స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి

by S Gopi |
స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బలహీన ర్యాలీ కొనసాగుతోంది. గతవారాంతం లాభాల స్వీకరణకు గురైన సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో రోజంతా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రధానంగా రికార్డు గరిష్ఠాలకు చేరిన భారత మార్కెట్లలో మదుపర్లు లాభాలను బుక్ చేసుకునేందుకు మొగ్గు చూపడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల కారణంగా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ముఖ్యంగా కీలక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎంఅండ్ఎం, టైటాన్ లాంటి కంపెనీల షేర్లలో అమ్మకాలు నష్టాలను పెంచాయి. దీంతో మర్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 36.22 పాయింట్లు నష్టపోయి 79,960 వద్ద, నిఫ్టీ 3.30 పాయింట్లు నష్టపోయి 24,320 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐటీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, నెస్లె ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. టైటాన్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎంఅండ్ఎం స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.50 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed