ASEAN: ఆసియాన్‌తో ఆర్థిక, భద్రతా సహకారమే భారతదేశ ప్రాధాన్యత: జైశంకర్

by Harish |
ASEAN: ఆసియాన్‌తో ఆర్థిక, భద్రతా సహకారమే భారతదేశ ప్రాధాన్యత: జైశంకర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆగ్నేయాసియా దేశాలతో రాజకీయ, ఆర్థిక, భద్రతా సహకారానికి భారతదేశం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆసియాన్-భారత విదేశాంగ మంత్రుల సమావేశం ప్రారంభ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఆసియాన్ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రస్తుతం జైశంకర్ లావోస్ రాజధానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండో-పసిఫిక్ విజన్‌కు ఆగ్నేయాసియా దేశాల సంఘం మూలస్తంభమని, కూటమితో సహాయ, సహకారాలను పెంపొందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను మరింత విస్తరించడానికి కట్టుబడి ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు.

భారతదేశం-ఆసియాన్ భాగస్వామ్యం ప్రతి రోజు గడిచేకొద్దీ మరిన్ని కోణాలను పొందుతుంది, ఇది ప్రోత్సాహకరంగా ఉంది. లావోస్ పర్యటనకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిందని ఆయన అన్నారు. 2014లో జరిగిన 9వ తూర్పు ఆసియా సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ భారత యాక్ట్ ఈస్ట్ పాలసీని ప్రకటించారు. ఇది వివిధ స్థాయిలలో విశాలమైన ఆసియా-పసిఫిక్ ప్రాంతంతో ఆర్థిక, వ్యూహాత్మక, సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించింది. ఆసియాన్‌లోని 10 సభ్య దేశాలు ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కంబోడియా. అంతకుముందు జైశంకర్ న్యూజిలాండ్‌కు చెందిన విన్‌స్టన్ పీటర్స్‌తో కూడా సమావేశమై విద్య, వ్యవసాయ సాంకేతికత, పసిఫిక్ దీవులు, క్రికెట్‌పై చర్చించారు.



Next Story