Retail Inflation: ఆగస్టులో 3.65 శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం

by S Gopi |
Retail Inflation: ఆగస్టులో 3.65 శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం మరోసారి ఐదేళ్ల కనిష్ట స్థాయిలోనే నమోదైంది. ఈ ఏడాది జూలైలో ఐదేళ్ల కనిష్టం 3.54 శాతంగా నమోదైన వినియోగదారు ధరల సూచీ(సీపీఐ) రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో స్వల్పంగా పెరిగి 3.65 శాతానికి చేరింది. అయితే, ఇది ఇప్పటికీ భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) లక్ష్యం 4 శాతం కంటే దిగువన వరుసగా రెండో నెల నమోదైంది. గురువారం విడుదల కేంద్ర గణాంకాల ప్రకారం.. రిటైల్ ద్రవ్యోల్బణంలో సగం వాటా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం 13 నెలల కనిష్టానికి చేరినప్పటికీ, అంతకుముందు నెల కంటే కొంత పెరిగి 5.66 శాతానికి చేరింది. జూలైలో ఇది 5.42 శాతంగా ఉంది. రూపాయి మారకం బలహీనంగా ఉండటం, రుతుపవనాల ప్రభావం కారణంగా సమీపకాలంలో ద్రవ్యోల్బణ ఒత్తిడి కొంతమేర ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. సమీక్షించిన నెలలో కూరగాయ ద్రవ్యోల్బణం 10.71 శాతానికి పెరిగింది. అంతకుముందు నెలలో ఇది 6.83 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా పడిన వర్షాలకు పంట దిగుబడిపై ప్రభావం చూపడంతో కూరగాయల ధరలు పెరిగాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులోనూ పెరిగే అవకాశం ఉందన్నారు. మిగిలినవాటిలో తృణధాన్యాల ద్రవ్యోల్బణం 7.31 శాతం, పప్పుధాన్యాలు 13 శాతం, పాలు, పాల ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 2.98 శాతంగా ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed