India space: భారత అంతరిక్ష రంగానికి 2023లో రికార్డు స్థాయిలో నిధులు

by Harish |   ( Updated:2024-07-30 09:47:45.0  )
India space: భారత అంతరిక్ష రంగానికి 2023లో రికార్డు స్థాయిలో నిధులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత అంతరిక్ష సాంకేతిక రంగం 2023 ఏడాదిలో రికార్డు స్థాయిలో రూ. 1,054 కోట్ల($126 మిలియన్ల)కు పైగా నిధులను సాధించిందని ఒక నివేదిక వెల్లడించింది. ఇది 2022లో $118 మిలియన్ల నుండి 7 శాతం పెరిగింది. అలాగే, 2021లో $37.6 మిలియన్ల నుండి దాదాపు 235 శాతం పెరగడం గమనార్హం. ప్రస్తుత 2024లో ఇప్పటి వరకు ఈ రంగానికి $10.8 మిలియన్ల నిధులు వచ్చాయి. ప్రపంచ మందగమనం కారణంగా అంతరిక్ష రంగంలో తోడ్పాటుకు నిధుల సమీకరణ కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కూడా గణనీయమైన ప్రభుత్వ మద్దతు, ముఖ్యమైన ఆవిష్కరణల ద్వారా స్పేస్‌టెక్ రంగంలో నిధులు క్రమంగా పెరుగుతున్నాయని, మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ Tracxn డేటా పేర్కొంది.

100 కంటే ఎక్కువ స్పేస్‌టెక్ స్టార్టప్‌లు ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలు తీసుకురావడానికి తీవ్రంగా పోటీ పడుతున్నాయి. వీటిలో ఎక్కువ భాగం గత ఐదేళ్లలో స్థాపించినవే. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో భారత అంతరిక్ష సాంకేతిక రంగానికి రూ. 1,000 కోట్ల నిధులు కేటాయించారు. దీంతో ఈ పరిశ్రమ రాబోయే నెలల్లో మరింత వ్యవస్థాపకత, పెట్టుబడులను ఆకర్షిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ రంగంలో అత్యధిక నిధులు సమకూర్చిన నగరాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా, హైదరాబాద్, చెన్నై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. స్కైరూట్ ఏరోస్పేస్ భారతదేశంలో అత్యధిక నిధులతో కూడిన యాక్టివ్ స్పేస్ టెక్ స్టార్టప్‌గా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత Pixxel , అగ్నికుల్ ఉన్నాయి. Tracxn సహ వ్యవస్థాపకులు నేహా సింగ్ మాట్లాడుతూ, ఇప్పుడు చూస్తున్న ముఖ్యమైన నిధులు, వ్యూహాత్మక పెట్టుబడులు భారతదేశాన్ని ప్రపంచ అంతరిక్ష పరిశ్రమలో అగ్రగామిగా నిలబెట్టడానికి ఉపయోగపడుతాయని అన్నారు.

Advertisement

Next Story