ఆఖరి గంట కొనుగోళ్లతో భారీ లాభాలు సాధించిన సూచీలు!

by Harish |
ఆఖరి గంట కొనుగోళ్లతో భారీ లాభాలు సాధించిన సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం భారీ లాభాలను సాధించాయి. వారమంతా సానుకూలంగా కదలాడిన సూచీలు శుక్రవారం రోజున కూడా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రాణించాయి. ఉదయం ప్రారంభంలో ఊగిసలాటకు గురైనప్పటికీ అనంతరం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు కీలక రిలయన్స్, విప్రో, ఐటీసీ వంటి కంపెనీల షేర్ల మద్దతుతో లాభాలను కొనసాగించాయి.

మిడ్-సెషన్ తర్వాత వరకు స్వల్ప లాభాలతో ట్రేడయిన స్టాక్ మార్కెట్లు చివరి గంటలో మదుపర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో భారీ లాభాలకు మారాయి. ఈ క్రమంలోనే కీలక బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్ మరోసారి కీలక 61 వేలు, నిఫ్టీ 18 వేల మార్కును అధిగమించాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 463.06 పాయింట్లు ఎగసి 61,112 వద్ద, నిఫ్టీ 149.95 పాయింట్లు లాభపడి 18,065 వద్ద ముగిశాయి. నిఫ్టీలో కన్స్యూమర్ డ్యూరబుల్స్ మాత్రమే నీరసించింది. బ్యాంకింగ్, మీడియా, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో విప్రో, నెస్లే ఇండియా, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ, ఐటీసీ, టెక్ మహీంద్రా, రిలయన్స్, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి.

యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, హిందూస్తాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 81.78 వద్ద ఉంది.

Advertisement

Next Story