SEBI: ఎఫ్అండ్ఓలో నష్టపోతున్న 93 శాతం మంది రిటైల్ ఇన్వెస్టర్లు

by S Gopi |
SEBI: ఎఫ్అండ్ఓలో నష్టపోతున్న 93 శాతం మంది రిటైల్ ఇన్వెస్టర్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్లలో సాధారణంగానే పెట్టుబడులు ఎక్కువ రిస్క్‌తో కూడుకుని ఉంటాయి. అయితే.. ట్రేడింగ్, ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్అండ్ఓ) సహా ఇతర విభాగాల్లో సొమ్ము పెట్టి నష్టపోతున్న వారు ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతున్నారు. తాజాగా కేపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ చేపట్టిన అధ్యయనం ప్రకారం.. ఎఫ్అండ్ఓ విభాగంలో ప్రతి 10 మంది రిటైల్ ఇన్వెస్టర్లలో తొమ్మిది మంది భారీగా నష్టపోతున్నారు. 2021-22లో 89 శాతం రిటైల్ ఈక్విటీ ఎఫ్అండ్ఓ ఇన్వెస్టర్లు డబ్బులు పోగొట్టుకున్నారు. కోటి మందికి పైగా ఎఫ్అండ్ఓ ఇన్వెస్టర్లలో 93 శాతం మంది 2022-2024 వరకు మూడేళ్లలో సగటున రూ. 2 లక్షల నష్టాన్ని(లావాదేవీల ఖర్చు కూడా కలిపి) చవిచూశారు. ఈ మూడేళ్లలో రిటైల్ ఇన్వెస్టర్ల మొత్తం నష్టాలు రూ. 1.8 లక్షల కోట్ల కంటే ఎక్కువే ఉన్నాయని అధ్యయనం పేర్కొంది. ఇదే సమయంలో లావాదేవీ ఖర్చులతో సహా టాప్ 3.5 శాతం మందిలో ఒక్కో రిటైల్ ఇన్వెస్టర్ రూ. 28 లక్షల చొప్పున నష్టాలను చూశారు. అంటే దాదాపు 4 లక్షల మంది రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోయారు. 1 శాతం మంది మాత్రమే రూ. లక్ష కంటే ఎక్కువ లాభాలను చూడగలిగారని అధ్యయనం వివరించింది. ట్రేడింగ్ కోసం కొత్త ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉండటం, తక్కువ లావాదేవీ ఖర్చులు వంటి అంశాలు ఎఫ్అండ్ఓలో పెట్టుబడులపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని సెబీ తెలిపింది. ఈ క్రమంలోనే ఎఫ్అండ్ఓ ట్రేడింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతున్నప్పుడు ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సెబీ సూచించింది.

Next Story