బీజేపీ కొత్త ప్రయత్నం.. వీటికి ప్రిపరెన్స్

by Anukaran |
బీజేపీ కొత్త ప్రయత్నం.. వీటికి ప్రిపరెన్స్
X

దిశ, న్యూస్ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఉనికిని నిలబెట్టుకోవడంపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, వరంగల్‌లపైనా బీజేపీ గురిపెట్టే దిశగా అడుగులు వేస్తున్నది. పార్టీలోని విభేదాలను కప్పిపుచ్చుకుంటూ ప్రజల దృష్టిని ఆకట్టుకునే దిశగా ప్రణాళికలను రచిస్తున్నది. ఇందులో భాగంగానే ముందుగా సెప్టెంబర్ నెల రోజులపాటు వివిధ అంశాలపై ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించి రోజువారీ కార్యక్రమాల జాబితాను విడుదల చేసింది. దీనికి తోడు ప్రభుత్వంపైనా గళాన్ని పెంచేందుకు ప్రధానాంశాలను ఎంపిక చేసుకుంది. ముఖ్యంగా కరోనా నియంత్రణ, తెలంగాణ విమోచన దినం, నదులమీద ప్రాజెక్టులు వంటి విషయాలపై పలు అంశాలను లేవనెత్తాలని నిర్ణయించింది. ప్రధానంగా సాధారణ ప్రజలతో పాటు విద్యార్థులు, కళాకారులు, రైతులను మచ్చిక చేసుకునేందుకు వారి సమస్యలపై ఆందోళన కార్యక్రమాలను తన నెల రోజుల జాబితాలో పొందుపరిచింది.

ఆకట్టుకునేందుకు..

ప్రస్తుతం సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతులు లేని కారణంగా బీజేపీ పబ్లిసిటీ ప్రణాళికలను రూపొందించుకున్నది. అందులో భాగంగానే తెలంగాణను పట్టి పీడిస్తున్న కరోనాపై జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌లో పరోక్షంగా వార్తల్లోకి ఎక్కాలని భావిస్తున్నది. ఈ సున్నితమైన అంశంపై ఎంత ఎక్కువగా విమర్శలు చేస్తే ప్రజల్లోకి అంతే స్థాయిలో వెళ్లాలని యోచిస్తున్నది. హైదరాబాద్ మహానగరం, శివారు పరిధిలోనే అత్యధికంగా ప్రభుత్వం, ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయని, వాటిల్లో పనిచేసే ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్ల సమస్యలపై పార్టీ వైఖరిని వెల్లడించే ప్రయత్నంలో భాగంగా విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించి వారిని ఆకట్టుకోవాలని భావిస్తోంది. ఆ క్రమంలోనే ప్రైవేట్ స్కూళ్ళు, కళాశాలలు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న అధిక ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి సమర్పించి ఇటు విద్యార్థులను, అటు సామాన్య ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకోవాలనేది బీజేపీ కొత్త ఎత్తుగడ. మరోమారు కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ స్థానికంగా ఆందోళనలు చేపట్టడం ద్వారా ప్రజల్లో పార్టీ కార్యక్రమాలు ప్రచారం చేయాలని నిర్ణయించింది.

సమావేశాలు

విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలంటూ ఆందోళనలను చేపడుతూనే ఓ వైపు కళాకారులతో, మరో వైపు మేధావులతో రాష్ట్ర స్థాయి సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి తోడు గోదావరి నదీ జలాలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి నీటి పంపకాలపై ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరిస్తూ వారి ఆదరణను చూరగొనాలని భావిస్తోంది. దీనికి తోడు ప్రజల్లోకి విపరీతంగా వెళ్లిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా బూత్ స్థాయిలో చేపట్టాలని ప్రతి బూత్ స్థాయిలో 10 మొక్కలు నాటి స్థానికంగా ప్రచారం చేసుకునేందుకు సిద్ధమైంది. అయితే, పార్టీలో పాతతరం నాయకులకు, కొత్త తరం నాయకులకు మధ్య అభిప్రాయ బేధాలున్నవనే విషయాన్న దాటేసి అందరూ ఒక్కటే అనే సంకేతాలు గ్రేటర్ హైదరాబాద్‌ ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నది. అందుకు గ్రేటర్ హైదరాబాద్‌లో గత 5 సం.లుగా ప్రజలకు చేసింది, నగరానికి ఒరగబెట్టిందేమీ లేదనే దిశగా విమర్శలు చేసేందుకు మరో కొత్త కార్యాచరణను రూపొందిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరి ఈ కార్యక్రమాలతో బీజేపీ ఏ మేరకు ప్రచారం పొందుతుందో వేచి చూడాలి.

tags: BJP plans, GHMC elections
Slug:
Photo: Telangana State BJP Office Photo



Next Story