వేల కోట్ల దోపిడీకి సర్కార్ కుట్ర.. వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు

by Gantepaka Srikanth |
వేల కోట్ల దోపిడీకి సర్కార్ కుట్ర.. వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని మద్యం షాపులన్నీ అధికార పార్టీ నాయకులకే ఇచ్చారని ఏపీ కాంగ్రెస్(AP Congress) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ఆరోపించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పనుల్లో రాజకీయ జోక్యం వద్దని చెప్పిన సీఎం చంద్రబాబు.. మద్యం సిండికేట్ల(Liquor syndicates)ను అరికట్టడంలో విఫలం అయ్యారని విమర్శించారు. ఎక్కడికక్కడే అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై సిండికేట్లుగా ఏర్పడి మద్యం షాపులను దక్కించుకున్నారని మండిపడ్డారు. కూటమి సిండికేట్లకే 3 వేలకు పైగా మెజారిటీ షాపులు దక్కాయంటే.. మీ పారదర్శకత, నిస్పాక్షికత ఎంత గొప్పగా ఉందో అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కనుసన్నల్లోనే టెండర్ల ప్రక్రియ సాగిందని ఆరోపించారు. సాధారణ ప్రజలకు షాపులు దక్కకుండా రాష్ట్ర వ్యాప్తంగా బెదిరింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు.

కొన్నిచోట్ల ప్రాణాలు పోతాయని హెచ్చరికలు కూడా చేశారని గుర్తుచేశారు. కూటమి నేతలకు కాదని పొరపాటున ఎవరినైనా లాటరి చిక్కితే, లైసెన్స్ ఇస్తారా? అని కూడా బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. ‘సీఎం గారు.. ఏసీ రూముల్లో కూర్చుని హెచ్చరికలు జారీ చేస్తే సరిపోతుందా? చర్యలు ఏవి? గత వైసీపీ “only cash” అని గుడిని మింగేస్తే ఇప్పుడు మీరు లింగాన్ని మింగేస్తున్నారు. ప్రైవేటు పేరుతో తక్కువ ధర అని చెప్పి, మద్యం ఏరులై పారించి వేల కోట్లు దోపిడీకి కూటమి సర్కార్ తెరలేపింది. అందుకేనేమో మీ పాపాల చిట్టాలు రేపు బయటపడకుండా ఉండటం కోసం పాత సర్కారు మద్యం స్కాములోని పాపాలపుట్టలు బద్దలుకాకుండా జాగ్రత్త పడుతున్నారు’ అని షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed