తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారమంతా ఓ కట్టుకథ: వైఎస్ జగన్

by srinivas |
తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారమంతా ఓ కట్టుకథ: వైఎస్ జగన్
X

దిశ, వెబ్ డెస్క్: డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే తిరుమల లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారని మాజీ సీఎం జగన్ అన్నారు. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఆయన స్పందించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు 100 రోజుల పాలనపై చర్చ జరగకుండా ఉండేందుకే కల్తీ నెయ్యి వ్యవహారానికి తెరపైకి తీసుకొచ్చారని, అదంతా ఓ కట్టుకథ అని ఆయన కొట్టిపారేశారు. దేవుళ్ల వద్ద కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీరుతో వందలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని జగన్ మండిపడ్డారు.

‘‘తిరుమలకు వచ్చిన నెయ్యిని మూడుసార్లు టెస్ట్ చేస్తారు. ఆ తర్వాతే లడ్డూ తయారీలో వినియోగిస్తారు. అబద్ధాలకు రెక్కలు కడుతున్నారు. నెయ్యి విషయంలో దారుణమైన అబద్ధాలాడుతున్నారు. జులై 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా నెయ్యి ట్యాంకర్ నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. జులై 23న రిపోర్టు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ చంద్రబాబు ఏం చేస్తున్నారు. లడ్డూ ప్రక్రియ ఎప్పటి నుంచో నడుస్తుంది. మధ్యలో ఎవరో వచ్చి ఏదో చేసేది ఏమీ ఉండదు. మన వెంకటేశ్వరస్వామి, మన గుడిపై దుష్ప్రచారం చేస్తున్నారు. తిరుమలలో మేము విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాం. తిరుమల వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. టీటీడీ బోర్డుదే అధికారం. టీటీడీ బోర్డు కూర్పు చేయడం కష్టం. టీటీడీ బోర్డుకు రికమండేషన్స్ చాలా మంది నుంచి వస్తాయి. ప్రతిపక్ష నేతలు కూడా బోర్డులో సభ్యత్వం కావాలని ఫోన్ చేస్తారు. టీటీడీ బోర్డులో విశిష్టమైన వాళ్లందరూ సభ్యులుగా ఉంటారు. దేవుడికి మంచి సేవ చేయడం ఎలా అని ప్రతి నిమిషం ఆలోచిస్తారు. అలాంటి టీటీడీ బోర్డుపై దుష్ప్రచారం చేయడం ఎంత కరెక్ట్ ’’ అని జగన్ ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed