టీడీపీ-జనసేనపొత్తుతో ముందుకెళ్తాం..వైసీపీని ఓడిస్తాం: జనసేన నేత జాన్ బాబు

by Seetharam |   ( Updated:2023-11-16 12:48:54.0  )
టీడీపీ-జనసేనపొత్తుతో ముందుకెళ్తాం..వైసీపీని ఓడిస్తాం: జనసేన నేత జాన్ బాబు
X

దిశ , డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం-జనసేన పార్టీల పొత్తును రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని పి.గన్నవరం జనసేన పార్టీ నాయకులు పెనుమాల దేవి జాన్ బాబు అన్నారు. రాబోయే ఎన్నికల్లో పొత్తుతో వైసీపీని ఓడించడం ఖాయమని అన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు సమన్వయంతో పనిచేసి వైసీపీని గద్దెదించుతామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎంపీపీగా జనసేన అభ్యర్థి గనిశెట్టి నాగలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీగా చెల్లుబోయిన గంగాభవాని ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మీశ్రీనివాస్‌, వైస్ ఎంపీపీ గంగాభవానీకి పెనుమాల దేవీ జాన్ బాబు అభినందనలు తెలిపారు. ఈ ఒప్పందంతో టీడీపీ-జనసేనల మధ్య బలం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా పి.గన్నవరం నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుంటామని పెనుమాల జాన్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే గత పరిషత్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు పొత్తులో భాగంగా పోటీ చేసి అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ పదవి ఇరు పార్టీల పరమైంది. దీంతో తొలి రెండున్నరేళ్లు టీడీపీ, మరో రెండున్నరేళ్లు జనసేనకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. దీంతో తొలుత ఎంపీపీగా టీడీపీకి చెందిన అంబటి భూలక్ష్మి ఎన్నికయ్యారు. ఆమె పదవీకాలం పూర్తవ్వడంతో తాజాగా జనసేన అభ్యర్థి గనిశెట్టి నాగలక్ష్మి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీపీ నాగలక్ష్మీకి అభినందనలు తెలిపిన వారిలో వార్డు మెంబర్ నల్లా దుర్గారావు,తోట శ్రీనువాసరావు,బండి మణికంఠ, శ్రీకాంత్, కొప్పినీడి మణికంఠ, షేక్ సుభానీలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed