దీపావళి షాపులు పెడుతున్నారా..? రూ.లక్ష కట్టాల్సిందే..!

by srinivas |
దీపావళి షాపులు పెడుతున్నారా..? రూ.లక్ష కట్టాల్సిందే..!
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: దీపావళి రాకముందే విశాఖలో కూటమి నేతల జేబులు నిండుతున్నాయి. దీపావళి షాపులకు కొందరు నేతలు అప్పుడే లక్ష రూపాయల రేటు నిర్ణయించి ఇటు అధికారులతోనూ, అటు వ్యాపారులతోనూ మంతనాలు జరుపుతున్నారు. దీపావళి బాణసంచా షాపులను ఇళ్ల మధ్య కాకుండా పెద్ద మైదానాల్లో పెట్టాల్సి ఉండటంతో వాటిని ముందుగానే బ్లాక్ చేసిన కొందరు నేతలు అప్పుడే వ్యాపారాన్ని ప్రారంభించారు.

ఖర్చు రూ.20,000 రాబడి రూ.80,000

దీపావళి షాపునకు ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల మైదానం, ఏఎస్ రాజా కళాశాల మైదానం, జైల్ రోడ్డు, బీచ్ రోడ్‌లోని మరికొన్ని ఖాళీ స్థలాలకు పోలీసులు అనుమతులు ఇస్తున్నారు. వాటన్నింటినీ ముందుగానే తమ గుప్పెట్లో పెట్టుకున్న కొందరు నేతలు ఈ ఏడాది షాపు అద్దెను లక్ష రూపాయలుగా నిర్ణయించారు. నిజానికి షాపు ఏర్పాటుకు అయ్యే ఖర్చు 20 వేల రూపాయల లోపే.

అధికారుల సహకారంతో దందా

నిజానికి మున్సిపల్, పోలీస్ అగ్నిమాపక శాఖ అధికారులు సంయుక్తంగా దరఖాస్తులను పరిశీలించి దీపావళి షాపులను మంజూరు చేయాలి. అందుకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలి. దీనికి విరుద్ధంగా విశాఖలో కొందరు కూటమి నేతలే వ్యవహారాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకొని డబ్బు కోసం డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రెండు రోజుల వ్యాపారానికి లక్షా?

రెండు, మూడు రోజుల వ్యాపారానికి లక్ష రూపాయలు చెల్లించాల్సిందే అంటూ కూటమి ద్వితీయ శ్రేణి నాయకులు వ్యాపారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. గతంలో ఎందరో లేని విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో కూటమి పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు ఈ విధంగా రెచ్చిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కూటమి ప్రజా ప్రతినిధులు కూడా ఇందులో జోక్యం చేసుకోకుండా కాలక్షేపం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు తమ కింద ఉండే ఒక్కొక్క నేతకు 20 షాపులు, 30 షాపులు కేటాయించడం ఇప్పుడు విభేదాలకు దారితీస్తోంది. తమకు ఇందులో వాటా ఇవ్వాలని మిగిలిన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు

వ్యాపారం జరుగుతుందా?

లక్ష రూపాయలు కట్టి మూడు రోజులు వ్యాపారం చేస్తే ఎంత లాభం వస్తుందో తెలియక వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆ సమయంలో వర్షాలు పడితే అసలుకే ఎసరు వస్తుందని భయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని వ్యాపారుల నుంచి గ్రౌండ్ అద్దెలు, అనుమతులకు సంబంధించిన రుసుములు మాత్రమే వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాజకీయ నాయకులను పక్కనపెట్టి షాపులు వ్యవహారాన్ని ప్రభుత్వ నిబంధన మేరకు అధికారుల ద్వారా జరిపించాలనే డిమాండ్ రూపొందుతోంది.

Advertisement

Next Story