మా భూమిని కబ్జా చేశారు... పర్మిషన్ ఇస్తే పాకిస్థాన్ వెళ్లిపోతాం..!

by srinivas |
మా భూమిని కబ్జా చేశారు... పర్మిషన్ ఇస్తే పాకిస్థాన్ వెళ్లిపోతాం..!
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: తమ స్థలంలో పనులు చేసుకుంటుండగా గూండాలొచ్చి తమపై దాడి చేశారని ఓ ఎన్నారై జంట గురువారం కన్నీరుమున్నీరైంది. ఇది భారత దేశమా.. పాకిస్తానా అంటూ ఆక్రందన వ్యక్తం చేసింది. తమకు జరిగిన అన్యాయంపై నగర పోలీస్ కమిషనర్‌తో పాటు హోంమంత్రి అనిత, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌లకు వారు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరగకపోతే దేశాన్ని వదిలి కుటుంబమంతా ఇతర దేశాలకు పోతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో బాధితులు మీడియాతో మాట్లాడారు. వివరాలిలా ఉన్నాయి.

స్థలం వివాదంలో కోర్టు తీర్పు ఇచ్చినా..

వేపగుంట -సింహాచలం రోడ్డులో సింహపురి కాలనీ వద్ద ప్లాట్ నంబర్ 27/28లలో ఉడా అనుమతి పొందిన 1/2004 పేరిట 446 గజాల స్థలం ఉంది. ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తగా విషయం కోర్టుకు చేరింది. చివరకు ఆ స్థలం వెంకట పద్మజ, నాయుడు దంపతులకే చెందుతుందని విశాఖ కోర్టు పర్మినెంట్ ఇంజెక్షన్ ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో నాయుడు తండ్రి కొన్నాళ్లగా ఆ స్థలంలో పనులు చేయించుకుంటుండగా డీవీ మహేష్, అనుచరులు అడ్డుపడుతూ వస్తున్నారన్నది ఆరోపణ. దీంతో అమెరికాలో గ్రీన్‌ కార్డ్ హోల్డర్ అయిన నాయుడు, వెంకట పద్మజ దంపతులు హుటాహుటిన విశాఖ వచ్చేశారు. గురువారం ఉదయం కూడా ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. తమపై కొంతమంది దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ బాధితులు నేరుగా పోలీస్ కమిషనర్‌ను సంప్రదించారు. ఆయన వెంటనే పెందుర్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కబ్జాదారులు అక్కడ నుంచి పరారయ్యారు. గోశాల వద్ద మైత్రీనగర్ లే అవుట్ వద్ద చోటు చేసుకున్న ఈ సంఘటన విశాఖ నగరంలో సంచలనం రేకెత్తించింది. తాము అనుమానం వ్యక్తం చేసే వ్యక్తులపై చర్యలు చేపట్టాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

కబ్జాదారులపై కఠిన చర్యలు: సీపీ

కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. అవసరమైతే పీడీ యాక్టు కూడా ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఇటువంటి సంఘటనలు మరలా జరిగితే క్షమించేదే లేదని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed