Tirumala: తిరుమల కల్తీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం.. ఏఆర్ డెయిరీపై కేసు నమోదు

by Shiva |
Tirumala: తిరుమల కల్తీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం.. ఏఆర్ డెయిరీపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఆనవాళ్లు ఉన్న నెయ్యిని వాడారంటూ ఇటీవల సీఎం చంద్రబాబు (CM Chandrababu) చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ వివాదంపై శ్రీవారి భక్తులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కల్తీ నెయ్యి వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తిరుమల ఆలయనికి నెయ్యి సరఫరా విషయంలో ఏఆర్ డెయిరీ (AR Dairy) ఎలాంటి నిబంధనలు పాటించలేదని టీటీడీ అధికారి మురళీకృష్ణ (TTD officer Muralikrishna), తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏఆర్ డెయిరీ (AR Dairy)పై కేసు నమోద చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

కాగా, వైసీపీ హయాంలోని టీటీడీకి ఆవు నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డెయిరీలో కేంద్ర ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులు మూడు రోజుల క్రితం తనిఖీలు చేపట్టారు. తమిళనాడు రాష్ట్రంలోని దిండుగల్ ప్లాంట్‌లో సుమారు 2 రెండు గంటల పాటు తనిఖీలు చేసి నెయ్యి, వెన్న, పెరుగు శాంపిల్స్ సేకరించారు.

ఏ విచారణకైనా సిద్ధం: ఏఆర్ డెయిరీ

మరోవైపు టీటీడీ (TTD)కి సరఫరా చేసిన నెయ్యిలో జంతు కొవ్వు ఆనవాళ్లు ఉన్నట్లుగా వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ విషయంలో ఎలాంటి న్యాయ విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. నెయ్యి తయారీలో తాము ఎలాంటి తప్పులు చేయలేదనే విషయం త్వరలోనే బయటకు వస్తుందని అన్నారు. జూన్, జులైలో టీటీడీకి పంపిన నెయ్యిని అంతా ఆలయ అధికారులు తిరిగి వెనక్కి పంపించేశారని డెయిరీ యాజమాన్యం తెలిపింది. తిరుమలకు తాము స్వచ్ఛమైన నెయ్యినే పంపించామని, టెస్ట్ చేశాకే ట్యాంకర్లు కంపెనీ నుంచి బయటికెళ్తాయని కంపెనీ స్పష్టం చేసింది. నెయ్యిని టెస్ట్ చేసిన రిపోర్టు కూడా లారీలతోనే ఆలయానికి పంపుతామని ఏఆర్ డెయిరీ (AR Dairy) పేర్కొంది.

Next Story

Most Viewed