Chandrababu: కేంద్రమంత్రి గారూ.. ఆ భూమిని కాపాడండి.. !

by srinivas |
Chandrababu: కేంద్రమంత్రి గారూ.. ఆ భూమిని కాపాడండి.. !
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలోని అల్లంచెర్లరాజుపాలెం గ్రామంలో పర్యావరణ పరంగా విలువైన అటవీ భూమి అన్యాక్రాంతం అవుతోందని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు లేఖ రాశారు. అటవీ భూముల ఆక్రమణలపై తక్షణ చర్యలు కోరుతూ లేఖ రాశారు. అల్లంచెర్లరాజుపాలెం అటవీ ప్రాంతం కింద 3,255 ఎకరాల అటవీ భూమి 1950 నుంచి అటవీ శాఖ ఆధీనంలో ఉందన్నారు. అటవీ శాఖ అధికారులకు చెప్పకుండా రెవెన్యూ అధికారులు కొంతమేర అటవీ భూమిని గతంలో సాగుభూమిగా ప్రకటించారని, న్యాయ సూత్రాలకు విరుద్ధంగా రెవెన్యూ అధికారులు నాడు తీసుకున్న నిర్ణయంపై కోర్టులలో వివాదం నడుస్తుందని తెలిపారు. దీన్ని ఆసరాగా చేసుకుని తాజాగా అల్లంచెర్ల రాజుపాలెం పాలెం ఫారెస్ట్‌ బ్లాక్‌ పరిధిలోని భూమి తమ ఆధీనంలో ఉందని ఆక్రమణదారులు, వారి వారసులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారని వివరించారు. ఈ భూముల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆ ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారని, బోరు బావులు తవ్వుతున్నారని, తద్వారా భూమి తమ ఆధీనంలో ఉందని, దానిని అటవీ భూమిగా ప్రకటించడం చట్ట విరుద్ధమని పిటిషనర్లు తప్పుడు వాదనలకు దిగుతున్నారన్నారు.

అటవీ భూముల అక్రమణకు జరుగుతున్న ఈ ప్రయత్నాలకు, అక్రమ రెవెన్యూ రికార్డులు సృష్టించడానికి వైసీపీ ప్రభుత్వం వారికి మద్దతు ఇస్తుందని ఆరోపించారు. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వ శాఖ వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని అటవీ భూములను కాపాడాల్సిన అవసరం ఉందని సూచించారు. తక్షణమే మొత్తం అటవీ భూమిని సర్వే చేసి స్పష్టమైన సరిహద్దులను ఏర్పాటు చేయాలని, వివిధ న్యాయస్థానాలలో పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రభుత్వం గట్టిగా పోరాడాలని, భూ కబ్జాదారులను నుంచి అటవీ ప్రాంతాన్ని కాపాడాలని, అల్లంచెర్లరాజుపాలెం ఫారెస్ట్ భూమి అన్యాక్రాంతం చేయడానికి భూ కబ్జాదారులతో కుమ్మక్కైన సంబంధిత అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed