ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో సంచలన తీర్పు: ఆస్తుల జప్తునకు కోర్టు గ్రీన్ సిగ్నల్

by Seetharam |   ( Updated:2023-12-02 07:26:43.0  )
ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో సంచలన తీర్పు: ఆస్తుల జప్తునకు కోర్టు గ్రీన్ సిగ్నల్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ ఫైబర్ గ్రిడ్‌ కుంభకోణం కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కేసులో రూ.114 కోట్ల ఆస్తులను జప్టు చేసేందుకు ఏసీబీ కోర్టు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసులో ఉన్న ఏడుగుు నిందితులకు చెందిన రూ.114 కోట్ల ఆస్తులను జప్తు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఇకపోతే ఈ కేసులో ఇప్పటికే సీఐడీ ఆస్తుల అటాచ్‌కు సిద్ధమైంది. అందుకు హోంశాఖ సైతం ఆమోదం తెలిపింది. దీంతో ఆస్తుల అటాచ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి కోరింది సీఐడీ. టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు చంద్రబాబు నాయుడు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్థులను అటాచ్ చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ఫైబర్ గ్రిడ్‌ కుంభకోణంలో రూ.114 కోట్లు దుర్వినియోగం అయ్యాయని సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ1గా వేమూరి హరికృష్ణ, ఏ 2గా టెరా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపిచంద్, ఏ 25గా చంద్రబాబు పేర్లను సీఐడీ చేర్చిన సంగతి తెలిసిందే.


ఇప్పటికే హోంశాఖ అనుమతి

ఏపీ ఫైబర్ గ్రిడ్‌ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన వారి ఆస్తుల అటాచ్‌మెంట్‌‌కు సీఐడీ సిద్ధమైంది. ఈ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్ మెంట్‌కు వైసీపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ సీఐడీకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో న్యాయస్థానం అనుమతి కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన విజయవాడ ఏసీబీ కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. ఆస్తుల అటాచ్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆరోపణలు ఇవే

తెలుగుదేశం పార్టీ హయాంలో ఏపీ ఫైబర్ గ్రిడ్‌ కుంభకోణం జరిగిందని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు సీఐడీకి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసు విచారణలో భాగంగా ఈ ఫైబర్ గ్రిడ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌తోపాటు మరికొందరిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సన్నిహితులకు లాభం చేకూర్చేలా ఏపీ ఫైబర్ గ్రిడ్ విషయంలో వ్యవహరించారని సీఐడీ ఆరోపిస్తోంది. అక్రమాలకు పాల్పడిన టెరాసాప్ట్‌తో పాటు వేమూరి హరిప్రసాద్‌కు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ భావించింది. వీటితోపాటు విశాఖపట్నం, గుంటూరుతో పాటు హైదరాబాద్‌లోని దాదాపు రూ.114 కోట్ల ఆస్తుల జప్తుకు సీఐడీ సన్నద్ధమైన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడును మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబుపై కేసులు పెట్టడం, ఆస్తులను జప్తు చేయడం చేస్తోందని టీడీపీ మండిపడుతుంది.

Read More..

చంద్రబాబుకు సీఐడీ షాక్..సుప్రీంకోర్టులో పిటిషన్

Advertisement

Next Story

Most Viewed