AP News:ఉచిత సిలిండర్ల పథకం పై ప్రజల్లో గందరగోళం..!?

by Jakkula Mamatha |
AP News:ఉచిత సిలిండర్ల పథకం పై ప్రజల్లో గందరగోళం..!?
X

దిశ,పాలకొల్లు: ఏపీలో దీపావళి పండుగ నుంచి టీడీపీ సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఉచిత సిలిండర్ల పథకం అమలు చేస్తామని కూటమి పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఏపీలో ఒక కోటి 48 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్న విషయం తెలిసిందే. ఉచిత సిలిండర్ల పథకంలో భాగంగా ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

అర్హులు అంటే ఎవరనీ ప్రశ్నిస్తున్న ప్రజలు..

అర్హులకు మాత్రమే ఉచిత సిలిండర్లు ఇస్తామని ప్రకటించడం నేపథ్యంలో అర్హులు అంటే ఎవరు? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీపం పథకం కింద ఇచ్చిన వారికా, లేక ఉజ్వల పథకంలో ఇచ్చిన వారికా, లేక జనరల్ గా తెల్ల కార్డుదారులు అందరికినా, లేక ఏ కార్డు ఉన్న సిలిండర్ లు ఉన్న వారందరికినా అనేది స్పష్టత లేకపోవడంతో ఎవరికో తెలియక తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది.

బుకింగ్ ఎక్కడో తెలియక కూడా ఇబ్బందులే..

ఈ నెల 24 నుంచి ఉచిత సిలిండర్ల కోసం బుకింగ్ చేసుకోవచ్చని కూటమి నాయకులు ఇష్టానుసారంగా ప్రకటనలు ఇస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏ పథకంలో వారు, ఎవరు బుకింగ్ చేసుకోవాలి, మామూలుగా ఇప్పుడున్న విధంగానే బుకింగ్ చేసుకోవాలా లేక దానికి వేరే బుకింగ్ మొబైల్ నెంబర్లు ఇస్తారా అనే ప్రశ్నలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలి..

ఉచిత సిలిండర్లు బుకింగ్ చేసుకునేందుకు తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అర్హులు ఎవరు, ఎక్కడ బుకింగ్ చేసుకోవాలి అనే విషయం కూడా తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

Next Story