కోటి తీసుకో.. షాప్ వదులుకో !

by Prasanna |
కోటి తీసుకో.. షాప్ వదులుకో !
X

దిశ ప్రతినిధి, కర్నూలు : నూతన మద్యం పాలసీలో భాగంగా టెండర్లలో దుకాణాలు దక్కించుకున్న వారికి సిండికేట్లు బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు సమాచారం. షాప్ వదులుకుంటే రూ.కోటి, గుడ్ విల్ కింద ప్రతి నెలా రూ.15 వేల చొప్పున ఇస్తామని బేరం పెట్టినట్లు తెలిసింది. మరోవైపు దుకాణదారులకు నేతల నుంచి ఒత్తిళ్లు తప్పడంలేదు. కమీషన్‌కు ఒప్పుకుంటేనే వ్యాపారం పెట్టనిచ్చేదంటూ హెచ్చరించడంతో డైలామాలో పడ్డారు. దీంతో తొలిరోజు చాలా ప్రాంతాల్లో దుకాణాలను ప్రారంభించలేదు.

204 మద్యం దుకాణాలు..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 204 ప్రైవేట్ మద్యం దుకాణాలకు లాటరీ ద్వారా కేటాయింపులు జరిగాయి. వీరంతా దుకాణాలు ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. అయితే వ్యక్తిగతంగా షాపులు దక్కించుకున్న వారు మాత్రం నిర్వహణ కోసం దాదాపు రూ.40 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంది. అంత స్థోమత లేని వారంతా ఇతరులకు ఇచ్చే యోచనలో పడ్డారు. టెండర్ విధానంలో షాపులు రాని వారు, షాపులు దక్కించుకున్న వారంతా సిండికేట్ గా ఏర్పడి వ్యక్తిగత దుకాణాదారుల నుంచి షాపులు ఇప్పించుకునే పనిలో పడ్డారు.

దారికి తెచ్చుకునే ప్రయత్నాలు..

మరోవైపు బెదిరింపుల పర్వం ఆగడంలేదు. మొదట 50-50తో ఒప్పందం చేసుకుని చాలా మంది టెండర్లు వేశారు. మరి కొంతమంది ఆన్ లైన్ ద్వారా సమర్పించారు. వీరికే ఎక్కువ శాతం దుకాణాలు దక్కాయి. వీరిలో ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ , రాజకీయ పలుకుడి లేని వారిని టార్గెట్‌ చేసుకుని ఎమ్మెల్యేలు ఒత్తిళ్లకు గురి చేస్తున్నారనే వార్తలు జోరందుకున్నాయి. కమీషన్ ఇవ్వకుంటే దుకాణాలు పెట్టనివ్వమంటూ తేల్చి చెబుతున్నారు. మరి కొందరు నేతలు దుకాణాదారులను ఇళ్లకు పిలుపించుకుని మీటింగులు పెట్టి మరీ కోటింగులిస్తూ తమ దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందుకే బుధవారం దుకాణాలు ప్రారంభించాల్సి ఉన్నా చాలా చోట్లా తెరుచుకోలేదని తెలుస్తోంది. రెండు, మూడ్రోజుల్లో ఈ సమస్య కొలిక్కి రానున్నట్లు సమాచారం.

అంతా మనోళ్లే..

ఇక, ఒకే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల అనుచరులు షాపులు దక్కించుకోవడంతో స్థానిక ఎమ్మెల్యేలకు పెద్ద సమస్యగా మారింది. కమీషన్ లేదా వాటా ఇవ్వాలని ఎమ్మెల్యేలు పట్టుబడుతుండగా అందుకు వారు ససేమిరా అంటున్నట్లు సమాచారం. వీరి మధ్య ఎలాంటి సయోధ్య కుదురుతుందోనని చర్చలు జోరందుకున్నాయి.

Advertisement

Next Story