ఉద్యోగాల జాతర: ఈనెలాఖరున గ్రూప్-1, గ్రూప్-2 నోటిషికేషన్

by Seetharam |   ( Updated:2023-11-01 12:39:14.0  )
ఉద్యోగాల జాతర: ఈనెలాఖరున గ్రూప్-1, గ్రూప్-2 నోటిషికేషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల జాతరకు తెరలేపింది. ఇప్పటికే యూనివర్శిటీలలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 3,200 పోస్టుల భర్తీకి నోటిషికేషన్ సైతం విడుదల చేసింది. అయితే తాజాగా గ్రూప్-1,గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదలకు రంగం సిద్ధం చేసింది. ఈ నెలాఖరులోపు గ్రూప్ 1, గ్రూప్ -2 నోటిఫికేషన్‌లు ఇస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. గ్రూప్-1లో 100, గ్రూప్-2 లో 900 పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో నిర్వహించాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. 2022 గ్రూప్ వన్ ప్రక్రియను రికార్డుస్ధాయిలో తొమ్మిది నెలల్లో పూర్తి చేశామని గౌతమ్ సవాంగ్ గుర్తు చేశారు. ఈ గ్రూప్ వన్ ప్రక్రియ కూడా తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.

సిలబస్‌లో ఎలాంటి మార్పులు ఉండవు

గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో రెండు పేపర్ల స్ధానంలో ఒకే పేపర్ ఉంటుందని గౌతమ్ సవాంగ్ తెలిపారు. గ్రూప్ వన్ మెయిన్స్‌లో ఐదు పేపర్లకు బదులు నాలుగే ఉంటాయని చెప్పుకొచ్చారు.వీటిలో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ తరహాలో, రెండు పేపర్లు డిస్క్రిప్షన్ తరహాలో ఉంటాయని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఇకపోతే లాంగ్వేజ్ లో రెండు పేపర్లకి బదులు ఒక పేపర్ మాత్రమే ఉంటుందని చెప్పుకొచ్చారు. సిలబస్‌లో ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. నిరుద్యోగ అభ్యర్ధులకు మేలు చేయడానికే పరీక్షా విధానంలో మార్పులు, చేర్పులు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. యూపీఎస్సీ, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లలో పరీక్షలను పరిశీలించిన తర్వాతే మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. డిసెంబర్ లో 2200 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలోనే పరీక్షలు జరిపి జనవరిలో ఫలితాలు వెల్ల డిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.

Advertisement

Next Story