ఇంద్రకీలాద్రి: కన్నుల పండువగా గిరి ప్రదక్షిణ

by Seetharam |
ఇంద్రకీలాద్రి: కన్నుల పండువగా గిరి ప్రదక్షిణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం లోక కళ్యాణార్థం, భక్త జనశ్రేయస్సు కోసం, ధర్మప్రచారం నిమిత్తం వేదపండితుల మంత్రోచ్చరణలు, అమ్మవారి నామ స్మరణలు, మంగళ వాయిద్యముల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం (ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద) వద్ద శ్రీ స్వామి, అమ్మవార్లుకు ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరి కాయ కొట్టి గిరిప్రదక్షిణ కార్యక్రమంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు చింకా శ్రీనివాసులు, బచ్చు మాధవీ కృష్ణ, కార్యనిర్వాహక ఇంజినీర్ కె వి ఎస్ కోటేశ్వర రావు, లింగం రమాదేవి, సహాయ కార్యనిర్వాహణాధికారి పి.చంద్ర శేఖర్, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమము శ్రీ కామధేను అమ్మవారి ఆలయము, కుమ్మరిపాలెం సెంటర్, నాలుగు స్థంబాల సెంటర్, సితార, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టి నగర్, కొత్తపేట, నెహ్రు బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా డప్పులు, బేతాల నృత్యములు తదితర సాంస్కృతిక కార్యక్రమముల నడుమ తిరిగి ఆలయమునకు చేరుకుంది. గిరిప్రదక్షిణ మార్గము నందు భక్తులు ప్రచార రథము లో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు, స్వామి వార్లకు భక్తిశ్రద్దలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి, పూజలు చేసి, అమ్మవారిని, స్వామి వారిని ప్రార్థించి, అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి.

Advertisement

Next Story

Most Viewed