AP BRS: ఏపీలో ఉద్యమం స్టార్ట్.. త్వరలో ఢిల్లీలో కొట్లాట

by srinivas |
AP BRS: ఏపీలో ఉద్యమం స్టార్ట్.. త్వరలో ఢిల్లీలో కొట్లాట
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర విభజన హామీల సాధనకై త్వరలో ఢిల్లీలో ఏపీ బీఆర్ఎస్​నేతలు భారీ నిరసన చేపట్టాలని నిర్ణయించారు. గుంటూరు రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక హోదా- విభజన హామీల సాధన అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేత జేటీ రామారావు మాట్లాడుతూ విభజన హామీల సాధన కోసం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ నేతృత్వంలో ఎందాకైనా పోరాడతామని స్పష్టం చేశారు.


షేక్ బాషా మాట్లాడుతూ తమకు అధికారమిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. వైసీపీ రాష్ట్ర ప్రజల్ని మోసగించిందని విమర్శించారు. టీడీపీ, వైసీపీలు కేంద్రంలోని బీజేపీ నేతల అడుగులకు మడుగులు వత్తుతూ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు.

అబ్బు పుల్లారావు నాయుడు మాట్లాడుతూ మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ ప్రజల్ని మోసాగిస్తూ తన రాజకీయ పబ్బం గడుపు కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పుకోలేని అయోమయ స్థితిలో రాష్ట్ర ప్రజానీకం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దుష్ట శక్తుల చేతుల్లో పాశవికంగా హత్య గాయించబడ్డ పేదల పెన్నిధి వంగవీటి మోహన రంగ హత్యపై సీబీఐ విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

షేక్ ఖాజావలి మాటాడుతూ వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవన్నారు. పోలవరం నిర్మాణం చేపట్టి ఏళ్ళు గడుస్తున్నా ప్రాజెక్టును పూర్తి చేయకుండా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

తిరుమల నాయుడు మాట్లాడుతూ తెలంగాణ మోడల్ అభివృద్ధి జరగాలంటే ప్రజలు బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో బీ‌ఆర్‌ఎస్ నేతలు గిద్దా శ్రీనివాస నాయుడు, కె. భాస్కర్ , కె.లక్ష్మి కమల,సైదావలీ, నళిని కాంత్ పాల్గొన్నారు.



Next Story