Godavari:భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి..క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం

by Jakkula Mamatha |
Godavari:భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి..క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం
X

దిశ, ఏలూరు:ఏలూరు జిల్లాలో ఒక పక్క కొండవాగుల బీభత్సం కొనసాగుతుండగా, మరోవైపు గోదావరి వరద ఉధృతి రూపం దాలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద శనివారం సాయంత్రం వరకు 22-25 మీటర్ల మధ్య వున్న నీటి మట్టం ఆకస్మికంగా పెరిగిపోయింది. ఆదివారం మధ్యాహ్నం నాటికి స్పిల్ వే దిగువన 31.900 మీటర్ల వరద నీరు వచ్చి చేరింది. దీంతో స్పిల్ వే కు వున్న 48 గేట్ల ద్వారా దిగువకు 8,37,179 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గోదావరి భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు 40.80 అడుగులున్న నీటిమట్టం సాయంత్రం 4 గంటలకు 41.30 అడుగులకు చేరుకుంది. 5 గంటలకు 41.90 అడుగులకు చేరింది. అంటే గంటకు సుమారు ఒక మీటరు చొప్పున వరద నీరు పెరుగుతోంది.

పోలవరం మండలంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండవాగులు, రిజర్వాయర్లు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఆదివారం ఉదయం మండలంలో భారీ వర్షం కురిసింది. గుంజవరం, పేడ్రాల కాలువలు, కొండవాగులు పొంగి గుంజవరం కల్వర్టుపై నుండి వరద నీరు ప్రవహిస్తోంది . లక్ష్మీనారాయణ దేవి పేట (ఎల్ఎన్ డి పేట) రిజర్వాయర్ కి కొండవాగుల వరద వచ్చి చేరడంతో రిజర్వాయర్ నిండింది. ఎల్ఎన్‌డి పేట రిజర్వాయర్ సామర్థ్యం 90.05 టిఎంసిలు కాగా ప్రస్తుతం రిజర్వాయర్లో 88.10 టీఎంసీల నీటిమట్టం నమోదయ్యింది.

ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం అదే నీటిమట్టాన్ని నిర్వహిస్తూ 3 స్లూయిజ్ గేట్లకు గాను ఒక్క గేటుని పది సెంటీమీటర్ల పైకి ఎత్తి 330 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసినట్లు ఎఇ కొండలరావు తెలిపారు. కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొవ్వాడ కాలువ లోకి వరద చేరి పట్టిసీమ అవుట్ ఫాల్ స్లూయిజ్ ద్వారా గోదావరిలోకి ప్రవహిస్తున్నాయి. గోదావరి నీటిమట్టం కడమ్మ స్లూయిజ్ గేట్లకు సమాంతరంగా ఉండడంతో కొండవాగుల వరద గోదావరిలోకి వెళ్ళే వీలులేక ఎగదన్ని పంట పొలాలు నీటమునిగాయి.



Next Story