AP:ఈ నెల 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు..క్లారిటీ ఇదే!

by Jakkula Mamatha |
AP:ఈ నెల 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు..క్లారిటీ ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ద‌ృష్టి పెట్టారు. టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మహిళలు ఫ్రీ బస్ జర్నీ పై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే దిశగా కసరత్తు చేస్తోంది.

ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ రోజే రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు. దీంతో ఉచిత బస్సు ప్రయాణం అమలు పై క్లారిటీ రావాల్సి ఉందంటున్నారు. నిన్న(శుక్రవారం) ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అర్టీసీ, రవాణా శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

కానీ..త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఈ నెల 12న మరోసారి ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో సమీక్ష జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై అధికారులతో చర్చిస్తారని చెప్పారు. ఈ క్రమంలో మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు. దీంతో 12వ తేదీ జరిగే సమీక్ష పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ రోజునే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు తేదీ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement

Next Story