‘చంద్రబాబు గారూ..’ అంటూ మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్

by srinivas |
‘చంద్రబాబు గారూ..’ అంటూ మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రజారోగ్య రంగానికి కూటమి ప్రభుత్వం ఉరితాడు బిగుస్తోందని, సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పతులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల సహా సిబ్బంది నియామకాల్ని ఆపడంతో జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవంక బిల్లులు చెల్లించకుండా ఆరోగ్య శ్రీని నీరుగారుస్తున్నారని, తద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తిరిగి ఆస్తులు అమ్ముకునే పరిస్థితిని తీసుకు వస్తున్నారని ఆరోపించారు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కావాల్సిన ఐదు మెడికల్‌ కాలేజీలను ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దీనికి ఇంకో సాక్ష్యంగా నిలుస్తోందన్నారు. ఈ ఏడాది ఆ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకాకపోవడం కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని జగన్ విమర్శించారు.

వైయస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేయడం కోసం చాలా విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చామని జగన్ గుర్తు చేశారు. విలేజ్-వార్డు క్లినిక్స్‌, ఫ్యామిలీ డాక్టర్‌, మండలానికి 2 పీహెచ్‌సీలు, 108,104 సర్వీసులు గణనీయంగా పెంపు, ఆరోగ్యశ్రీ పరిధిలోకి 3,257 చికిత్సలు, చికిత్స కాలంలో కోలుకునేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆరోగ్య ఆసరా, ప్రతి ఇంటిని జల్లెడపడుతూ ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలు ఎప్పుడూ లేని విధంగా చేపట్టామన్నారు. ఆస్పత్రుల్లో నాడు-నేడు, కొత్త మెడికల్‌ కాలేజీలకోసం రూ.16,880 కోట్లతో పనులు చేపట్టామని, ఇవన్నీ చివరిదశకు వచ్చాయని, ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కాలేజీ చొప్పున 17 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని రూ.8,480 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టామని జగన్ పేర్కొన్నారు.

Advertisement

Next Story