మోడీకి జగన్ బిడ్డలాంటోడు: కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్

by srinivas |
మోడీకి జగన్ బిడ్డలాంటోడు: కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్
X

దిశ ఏపీ బ్యూరో, అమరావతి: మోడీకి జగన్ బిడ్డలాంటోడని, మోడీ పర్మిషన్ ఇచ్చి, ఢిల్లీ జంతర్ మంతర్‌లో జగన్ తో ధర్నా చేయించారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ జగన్ ఎందుకు ధర్నా చేశారు? ఓడిపోయినందుకు ధర్నా చేశారా? సానుభూతి కోసం ధర్నా చేశారా? ఢిల్లీ ధర్నా వల్ల జగన్ అబాసుపాలయ్యారని, జగన్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబును కొట్టాడని, శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జగన్ వ్యాఖ్యానించడం అబద్ధమని పేర్కొన్నారు. పెద్దిరెడ్డి, చంద్రబాబు ఇరువురూ చదువుకునే రోజుల్లో చెరొక గ్రూపుకు నాయకత్వం వహించేవారని తెలిపారు. జగన్ పాలనలో ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, ఓబిసి కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయాయన్నారు. వైసీపీ పాలనలో నిర్వీర్యం అయిపోయిన కార్పొరేషన్లను టీడీపీ ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటుంది? నిధులు ఇస్తారా? ఇవ్వరా? టిడిపి ప్రభుత్వ వైఖరి ఏమిటి? అని చింతా మోహన్ ప్రశ్నించారు.

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ కార్పొరేషన్లకు దండిగా నిధులు ఇచ్చి యువతను ఆదుకుంటున్నారని చింతా మోహన్ తెలిపారు. రైతులు, రైతు కూలీల పరిస్థితి అధ్వానంగా ఉందని ఇందుకు కారకులెవరు? జగన్, చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మోడీ, చంద్రబాబు చెవిలో పువ్వులు పెట్టారని పేర్కొన్నారు. అమరావతి, పోలవరం నిర్మాణంకు కేంద్ర బడ్జెట్లో ఒక్క పైసా గ్రాంట్ గా నిధులు ఇవ్వలేదని, అమరావతికి 15 వేల కోట్లు అప్పు ఇప్పిస్తామని చెప్పడం బిజెపి ప్రభుత్వ ద్వంద నీతికి నిదర్శనమన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం గురించి పక్క రాష్ట్రాల్లో నవ్వుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి 7 లక్షల కోట్లు అని ఒకరు, కాదు 13 లక్ష కోట్లు అని మరొకరు చెబుతున్నారని పేర్కొన్నారు. ఎవరి మాటలు నమ్మాలో జనానికి అర్థం కావడం లేదని, రాష్ట్ర అప్పులపై వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. చంద్రబాబునాయుడు 2024 ఎన్నికల తరువాత బాహుబలి అయ్యారని చింతామోహన్ పేర్కొన్నారు.

Next Story