Breaking: రణరంగంగా పుంగనూరు.. చంద్రబాబు పర్యటనలో హైటెన్షన్.. గాల్లోకి కాల్పులు

by srinivas |
Breaking: రణరంగంగా పుంగనూరు.. చంద్రబాబు పర్యటనలో హైటెన్షన్.. గాల్లోకి కాల్పులు
X

దిశ, తిరుపతి ప్రతినిధి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 'ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పర్యటనలో భాగంగా అంగళ్లు నుంచి పుంగనూరు బయల్దేరిన చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు విశ్వప్రయత్నం చేశాయి. రహదారికి అడ్డంగా లారీని అడ్డు పెట్టారు. లారీ అడ్డు తొలగించాలని ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఈ క్రమంలో పోలీసు వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు టియర్‌‌గ్యాస్‌ ప్రయోగించి, గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులు లాఠీ ఛార్జిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.


వైసీపీ దాడిలో 20 కార్లు ధ్వంసం

పుంగనూరులోకి చంద్రబాబుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. చంద్రబాబు వచ్చే మార్గంలో భీమగానిపల్లి వద్ద ప్రధాన రహదారిపై కంటైనర్‌ లారీ, వాహనాలను పోలీసులు అడ్డుపెట్టారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరో వైపు అంగళ్లు నుంచి చంద్రబాబు కాన్వాయ్‌ వెంట వెళ్తున్న టీడీపీ నేతల వాహనాలపై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశాయి. ఈ ఘటనలో దాదాపు 20కి పైగా కార్ల అద్దాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది.

అంగళ్లులో రెచ్చిపోయిన వైసీపీ

అధికారమే అండగా అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలం అంగళ్లులో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లను వైకాపా కార్యకర్తలు చించేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. వైసీపీ కార్యకర్తలు చేసిన రాళ్ల దాడిలో మదనపల్లె మండలం కొత్తపల్లి ఎంపీటీసీ దేవేంద్రతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను నిలువరించేందుకు ప్రయత్నించారు. రాళ్లదాడి చేస్తున్న వైసీపీ కార్యకర్తలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని టీడీపీ నేతలు ఆరోపించింది.

ధైర్యం ఉంటే రండి.. చూసుకుందాం: చంద్రబాబు

''టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారు. డీఎస్పీ తన యూనిఫామ్‌ తీసేయాలి. బాంబులకే భయపడలేదు.. రాళ్లకు భయపడతానా?, ధైర్యం ఉంటే రండి చూసుకుందాం. పులివెందులకే వెళ్లాను ఇక్కడికి రాకూడదా?, నేనూ చిత్తూరు జిల్లాలోనే పుట్టా. పోలీసుల అండతోనే వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. ఎవరి జోలికీ మేము పోము.. మా జోలికి వస్తే ఊరుకోం. పుంగనూరు వెళ్తున్నా.. అక్కడి పుడింగి సంగతి తేలుస్తా. ఇక్కడ ఒక రావణాసురుడు ఉన్నారు. అతనికి ట్యాగ్‌ ఎమ్మెల్యే. ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా. ఇలాంటి నాయకులను రాజకీయంగా భూస్థాపితం చేయాలి. ఇక్కడ జరిగిన ఘటనలో పోలీసుల వైఫ్యలం ఉంది. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. అంగళ్లు ఘటనపై విచారణ జరపాలి. రాబోయే రోజుల్లో వైసీపీని తరిమికొట్టే పరిస్థితి వస్తుంది. పోలీసులు ఎవరికి ఊడిగం చేస్తున్నారు. ప్రజలు భూస్థాపితం చేస్తారనే భయంతోనే ఇలా చేస్తున్నారు'' అని చంద్రబాబు మండిపడ్డారు.

Read More..

Breaking: చంద్రబాబు పుంగనూరు టూర్‌లో హైటెన్షన్.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తత

Next Story

Most Viewed