కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి కంచుకోట: Nandamuri Balakrishna

by Rajesh |   ( Updated:2022-03-29 06:22:34.0  )
కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి కంచుకోట: Nandamuri Balakrishna
X

దిశ, తెలంగాణ బ్యూరో: కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని, పోరాటమే మన ఊపిరి.. ఎన్టీఆర్ కు మనం అందించే నివాళి అదే అని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. 29 మార్చి 1982 చారిత్రాత్మకమైన రోజు అని, తెలుగుజాతికి శుభదినం అని తెలిపారు. ఏ మహూర్తాన ఆ మహానుభావుడు పార్టీని ప్రకటించారో ముహూర్తబలం అంతగొప్పదని తెలిపారు. అందుకే ౪ దశాబ్దాలుగా తెలుగునాట పసుపుజెండా సమున్నతంగా రెపరెపలాడుతుందని తెలిపారు.

40ఏళ్లుగా పార్టీ ప్రస్థానం అప్రహతిహతంగా కొనసాగుతోందంటే వేలాదిమంది నాయకులు, లక్షలాది కార్యకర్తలు, కోట్లాది ప్రజల ఆశీస్సులే కారణమని, 21ఏళ్లు అధికారంలో ఉండటం, 19ఏళ్లు ప్రతిపక్షంగా ప్రజల కోసం పోరాడటం నిజంగా అద్భుతమని కొనియాడారు. 'ఆటుపోట్లకు బెదరకుండా, విఘ్నాలకు చెదరకుండా, తెలుగుజాతి అభ్యున్నతే లక్ష్యంగా సాగుతోన్న టీడీపీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. పుష్కరకాలం ఎన్టీఆర్ నాయకత్వంలో, గత 28ఏళ్లుగా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం సాధించిన విజయాలు అనన్యసామాన్యం. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీ కొత్తశకం లిఖించింది. రాష్ట్రాభివృద్ధిలో, పేదల సంక్షేమంలో ''టీడీపీకి ముందు, టీడీపీ తర్వాత'' అని చూసేలా చేసింది, చరిత్రను తిరగరాసింది' అని బాలయ్య చెప్పారు.


Advertisement

Next Story

Most Viewed