అంగన్వాడీలు, మహిళలు జగన్ రెడ్డిని గద్దె దింపడానికి మహాశక్తుల్లా మారబోతున్నారు: ఆచంట సునీత

by Seetharam |
అంగన్వాడీలు, మహిళలు జగన్ రెడ్డిని గద్దె దింపడానికి మహాశక్తుల్లా మారబోతున్నారు: ఆచంట సునీత
X

దిశ, డైనమిక్ బ్యూరో : అంగన్ వాడీ సిబ్బంది ఆవేదన గ్రహించి, వారికిచ్చిన హామీలు నెరవేర్చకుంటే జగన్ రెడ్డి మహాశక్తుల్లా మారిన మహిళాగ్రహాన్ని చవిచూస్తాడు అని టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రాసాధికార విభాగాల రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ అంగన్ వాడీ సిబ్బంది రోడ్డెక్కితే వైసీపీనేతలు ఒళ్లు కొవ్వెక్కి పిచ్చికూతలు కూస్తున్నారు అని మండిపడ్డారు. బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే చిన అప్పలనాయుడు అంగన్ వాడీ సిబ్బందిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. అప్పల నాయుడు తప్పు ఒప్పుకొని తక్షణమే అంగన్ వాడీ సిబ్బందికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకుంటే అంగన్ వాడీ సిబ్బందితో అప్పల నాయుడు ఇల్లు ముట్టడించి అతనికి బుద్దిచెబుతాం అని సునీత హెచ్చరించారు. చంద్రబాబు అంగన్ వాడీ సిబ్బంది జీతాలు పెంచితే జగన్ రెడ్డి తానేదో వారిని ఉద్ధరించినట్టు నిస్సిగ్గుగా తన సొంత మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాడు అని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి వాస్తవాలు తెలియాలంటే టీడీపీప్రభుత్వం 2018లో ఇచ్చిన జీవోనెం-18 చూడాలి అని సూచించారు. అంగన్ వాడీ కార్యకర్తల జీతాన్ని రూ.4,200 నుంచి రూ.10,500లకు హెల్పర్ల జీతాన్ని రూ.2,950 నుంచి రూ.6 వేలకు పెంచింది చంద్రబాబే అని చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి ఈ నాలుగున్నరేళ్లలో అంగన్ వాడీ సిబ్బందికి ముష్టి వేసినట్టు రూ.1000లు పెంచి, వారిపై ఎన్నడూ లేనంత పనిభారం మోపాడు అని టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రాసాధికార విభాగాల రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఆరోపించారు.

నిరవధిక సమ్మెకు మా మద్దతు

ఇకపోతే అంగన్ వాడీ సిబ్బంది నిరవధిక సమ్మెకు టీడీపీ అంగన్ వాడీ, ట్రేడ్ యూనియన్ విభాగాలు సంపూర్ణ మద్ధతు ప్రకటించాయని టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రాసాధికార విభాగాల రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత వెల్లడించారు. జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవే ర్చాలని డిమాండ్ చేస్తూ, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్ వాడీ సిబ్బంది గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారని..కానీ ఏనాడూ జగన్ రెడ్డి వారి ఆవేదనను పట్టించుకున్న పాపాన పోలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను అధికారంలోకి రాగానే తెలంగాణ కంటే మిన్నగా అంగన్ వాడీ సిబ్బంది జీతాలు పెంచుతానని, రిటైర్మెంట్ ప్రయోజనాలతో పాటు ఇతర బెనిఫిట్స్ అన్నీ అందిస్తానని జగన్ రెడ్డి బూటకపు హామీలిచ్చాడు అని మండిపడ్డారు. అంతేకాదు అంగన్ వాడీ కేంద్రాలకు నాణ్యమైన ఆహారం అందించలేని అసమర్థుడు జగన్ రెడ్డి అని ఆరోపించారు. ఈ ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాలకు అందిస్తున్న ఆహారంలో పాము కళేబరాలున్న ఖర్జూరాలు, పురుగులుపట్టిన బియ్యం, రాగిపిండి, కుళ్లిపోయిన గుడ్లు, కాలపరిమితి ముగిసిన పాలప్యాకెట్లు అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పనితీరు కోసం పిచ్చిపిచ్చి యాప్‌లు.. వైసీపీ నేతల వేధింపులు... అధికారుల అర్థంపర్థం సమీక్షలతో అంగన్ వాడీ సిబ్బందిని ఈ ప్రభుత్వం వేపుకుతింటున్నది అని టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రాసాధికార విభాగాల రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో అంగన్ వాడీ సిబ్బందికి పెంచిన జీతాలు, కేంద్రాల నిర్వహణకు అందించిన నిధులు, సిబ్బందికి అందించిన సంక్షేమ పథకాలు తప్ప, జగన్ రెడ్డి హాయాంలో వారికి పైసాలబ్ధి అందలేదు అని చెప్పుకొచ్చారు.అంగన్ వాడీ సిబ్బంది...ఆశావర్కర్లు.. సహా రాష్ట్రంలోని మహిళలందరూ జగన్ రెడ్డిని గద్దె దింపడానికి మహాశక్తుల్లా మారబోతున్నారు అని టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రాసాధికార విభాగాల రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత హెచ్చరించారు.

Advertisement

Next Story