Floods: అనంతలో వరదలు.. ముంచేసిన పండమేరు

by Y.Nagarani |   ( Updated:2024-10-22 06:14:56.0  )
Floods: అనంతలో వరదలు.. ముంచేసిన పండమేరు
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం(Anantapuram)లో కురిసిన భారీ వర్షానికి పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వర్షాలు పడటమే గగనంలా ఉండే అనంతలో వరద పోటెత్తింది. వాగు ఉద్ధృతికి ఇరువైపులా ఉన్న కాలనీలు నీటమునిగాయి. నగరంలో చాలా ప్రాంతాలు వరదనీటిలో నానుతున్నాయి. కనగానపల్లి చెరువు కట్ట తెగిపోవడంతో పండమేరు వాగుకు వరద పోటెత్తింది. వరదల్లో ఇళ్లన్నీ నీట మునగగా.. టూ వీలర్లు, ఆటోలు వరదలో కొట్టుకుపోతున్నాయి. కష్టపడి సంపాదించింది వరదపాలవుతుండటంతో కాలనీల్లో ఉన్న నివాసితులు కన్నీరు పెడుతున్నారు. వరద పెరుగుతుండటంతో బాధితుల్ని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగుతుండటంతో హైదరాబాద్- బెంగళూరు (Hyderabad - bengaluru highway) రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొత్త చెరువు - ధర్మవరం ప్రధాన రహదారిపై వంగపుయేరు ప్రవాహిస్తుండటంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెనుకొండలో కురిసిన భారీ వర్షానికి గుట్టూరు, వెంకటగిరిపాలెం చెరువులు పొంగి ప్రవహిస్తుండగా.. హైవేపైకి భారీగా వరదనీరు చేరింది. దీంతో బస్సులు, లారీలు, కార్లు హైవేపై వరదనీటిలో నిలిచిపోయాయి.

Advertisement

Next Story

Most Viewed