ఏపీలో 108 అడుగుల శ్రీరాముడి విగ్రహం..అమిత్ షా శంకుస్థాపన

by Seetharam |
ఏపీలో 108 అడుగుల శ్రీరాముడి విగ్రహం..అమిత్ షా శంకుస్థాపన
X

దిశ, డైనమిక్ బ్యూరో : కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీరాముడి 108 అడుగుల పంచలోహ విగ్రహం ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. మంత్రాలయం శ్రీమఠానికి సుమారు కిలోమీటర్ దూరంలో 10ఎకరాల సువిశాల స్థలంలో ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది. జై శ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహ నిర్మాణం జరగనుంది. అంతేకాదు గుజరాత్‌లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి రామ్ వాంజీ సుతార్‌ ఈ శ్రీరాముడి విగ్రహం రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఈ విగ్రహ నమూనాను ఆయన ప్రాథమికంగా ఖరారు చేశారు. అయితే ఈ నమూనా ఆధారంగా రూపొందించిన చిన్న విగ్రహంతో ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు. రూ.300 కోట్లతో నిర్మించనున్న ఈ శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి అమిత్ షా వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. శ్రీరాముడి పంచలోహ విగ్రహం ఏర్పాటుతో ప్రపంచ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా కర్నూలు జిల్లా మంత్రాలయం విరాజిల్లుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వ జన్మ సుకృతమని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ విగ్రహాన్నిరెండేళ్లలో పూర్తి చేయనున్నారు. అనంతరం విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు.

రామాలయం ఏర్పాటు సైతం

108 అడుగుల శ్రీరాముడి విగ్రహం ఏర్పాటుకు ముందు రామాలయం నిర్మించాలని జై శ్రీరామ్ ఫౌండేషన్ భావిస్తోంది. ఇందులో భాగంగా పూర్తి స్థాయి రాతి కట్టడంలా రామాలయాన్ని నిర్మించనున్నారు. ఆలయ ఆకృతుల రూపకర్తల్లో ప్రముఖుడైన డాక్టర్‌ ఎ.వేలుకు ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ పదెకరాల్లోనే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి, కాశీలోని విశ్వనాథ ఆలయం, సింహాచలంలోని నరసింహస్వామి దేవాలయం, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ ఆలయం, కేరళ అనంత పద్మనాభస్వామి దేవాలయం, బాసర జ్ఞాన సరస్వతి ఆలయం, కర్ణాటక చెలువ నారాయణస్వామి ఆలయం, తమిళనాడు మూషణం వరాహస్వామి ఆలయం, మహారాష్ట్రలోని విఠోభా రుక్మిణి ఆలయాలను తలపించే చిన్నపాటి ఆలయాలనూ నిర్మిస్తారని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed