Libya Floods: లిబియాలో మృత్యుఘోష.. వరదలకు 20 వేల మంది బలి

లిబియాలో మంగళవారం చోటుచేసుకున్న జల విలయం పెను విషాదాన్ని మిగిల్చింది.

Update: 2023-09-14 14:47 GMT

ట్రిపోలి : లిబియాలో మంగళవారం చోటుచేసుకున్న జల విలయం పెను విషాదాన్ని మిగిల్చింది. దేశంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న డెర్నా నగర వీధుల్లో మృతదేహాలు గుట్టలుగుట్టలుగా పడి ఉన్నాయి. వరదల ధాటికి రెండు నీటి ఆనకట్టలు కొట్టుకుపోవడంతో సంభవించిన మెరుపు వరదలకు ఎన్నో ఇళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. వేలాది మంది డెర్నా నగర ప్రజలను వరద నీళ్లు సముద్రంలోకి ఈడ్చుకెళ్లాయి. ఇప్పుడా మృతదేహాలు తీరానికి కొట్టుకొస్తున్నాయి. దీంతో డెర్నా సముద్ర తీరం శవాల కుప్పలా కనిపిస్తోంది.

ఈ వరదల్లో మృతిచెందిన వారి సంఖ్య 20 వేలు దాటిందని డెర్నా మేయర్ అబ్దుల్‌మేనమ్‌ అల్‌ ఘైతి వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. డెర్నాలో మృతదేహాలను భద్రపరిచే పరిస్థితి లేకపోవడంతో ఇతర నగరాల్లోని మార్చురీలకు తరలిస్తున్నారు. వందల సంఖ్యలో వస్తున్న మృతదేహాలను సామూహిక ఖననం చేస్తున్నారు.ఇప్పటికే ఈజిప్ట్, ట్యునీషియా, ఇటలీ, స్పెయిన్, టర్కీ, ఖతర్, యూఏఈ దేశాల నుంచి రెస్క్యూ టీంలు డెర్నా నగరానికి చేరుకున్నాయి.


Similar News